NTV Telugu Site icon

MS Dhoni: రాంచీలో ఓటేసిన ధోనీ.. ఎగబడ్డ అభిమానులు

Dhoni

Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ఎంఎస్ ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శనివారం దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. దీంతో తన స్వస్థలం రాంచీలో ఎంఎస్. ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిరోజుల క్రితమే ధోనీ బెంగళూరు నుంచి రాంచీ వరకు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణిస్తూ వెళ్లారు. ఒక సాధారణ వ్యక్తిలా ప్రయాణించడంపై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాగే ధోనీ ఓటు వేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన ఎక్స్‌లో పోస్టు చేసింది.

ఇది కూడా చదవండి: Telangana MLC ByPoll: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారం..

శనివారం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తంగా 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బీహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, జమ్మూ-కశ్మీర్‌లో ఒకటి, జార్ఖండ్‌లో నాలుగు, ఢిల్లీలో ఏడు, ఒడిశాలో ఆరు, ఉత్తరప్రదేశ్‌లో పద్నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ధోనీ కుటుంబంతో కలిసి రాంచీలోని సమీప పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటేశారు. ధోనీ పోలింగ్ కేంద్రానికి రాగానే అభిమానులు, ఓటర్లు, భద్రతా సిబ్బంది చుట్టుముట్టేశారు. మొబైల్‌లో ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపించారు. మొత్తానికి అతి కష్టం మీద.. భారీ భద్రత నడుమ ధోనీ ఓటేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతుండగా.. భారత ఎన్నికల సంఘం సైతం.. ‘‘తలా ఫర్‌ రీజన్‌’’ అంటూ ప్రజాస్వామ్యంలో ధోనీ సిక్సర్‌ బాదాడంటూ ఫొటోను షేర్‌ చేసింది.

ఇది కూడా చదవండి: Srinivasa Rao: ఎన్నికల సంఘంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఆరోపణలు.. ఏమన్నారంటే?

అలాగే మాజీ క్రికెటర్లు కపిల్‌ దేవ్‌,‌ గౌతం గంభీర్‌, రెజ్లర్‌ బబితా ఫొగట్‌ తదితరులు తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐపీఎల్‌-2024 ఆరంభానికి ముందే చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని వైదొలిగారు. ఆ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించారు. ధోనీ వికెట్‌ కీపర్‌‌గా.. బ్యాటర్‌గా కొనసాగారు. ఇక డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది.

ఢిల్లీలోని ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మరియు పశ్చిమ ఢిల్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఇక ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు బరిలో ఉన్నారు. కర్నాల్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, అనంతనాగ్‌ నుంచి పీడీపీ అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో దశ సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.