పశ్చిమ థాయ్లాండ్లోని పెట్చాబురి ప్రాంతంలో గల ‘దోన్ యై థాంగ్’ అనే పురాతన స్థలంలో శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో సుమారు 2,100 ఏళ్ల నాటి రెండు బంగారు ఉంగరాలు లభ్యమయ్యాయి. ఒక మానవ అస్థిపంజరం పక్కన ఇవి దొరికాయి. వీటిలో ఒక ఉంగరంపై పురాతన భారతీయ లిపి అయిన ‘బ్రాహ్మీ’ అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ప్రాథమిక పరిశీలనలో దీనిపై “పుసారఖితాస” అని రాసి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. దీని అర్థం “పుష్య నక్షత్రం చేత రక్షించబడేవాడు” అని. భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో పుష్య నక్షత్రం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
దొరికిన రెండో ఉంగరం ఎలాంటి నమూనాలు లేని సాదా బంగారు ఉంగరం. బ్రాహ్మీ లిపి ఆధారంగా ఈ ఉంగరాల యజమాని భారతదేశానికి చెందిన ‘వైశ్య’ (వ్యాపార) సామాజిక వర్గానికి చెందిన వర్తకుడు అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుత ధర ఎంత ఉండొచ్చు?:
నిజానికి… ఇలాంటి 2,100 ఏళ్ల నాటి అమూల్యమైన చారిత్రక వస్తువుల విలువను కేవలం బంగారం బరువుతో లేదా సాధారణ మార్కెట్ ధరతో కొలవలేము. అంతర్జాతీయ పురాతన వస్తువుల మార్కెట్, వేలం సంస్థల ప్రకారం.. వీటి చారిత్రక విలువ అమూల్యం. ఒకవేళ వీటికి అంతర్జాతీయ వేలం నిర్వహిస్తే, వీటి పురాతనత, అరుదైన బ్రాహ్మీ లిపి మరియు సాంస్కృతిక ప్రాధాన్యత కారణంగా వీటి ధర కోట్లాది రూపాయలు పలుకుతుంది. ప్రస్తుతానికైతే ఇవి థాయ్లాండ్ ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇక్కడ జరుపుతున్న తవ్వకాల్లో ఎనిమిది మానవ అస్థిపంజరాలతో పాటు కాంస్య (బ్రాంజ్), బంగారు ఆభరణాలు, మట్టి పాత్రలు దొరికాయి. ఇవన్నీ ఆ కాలంలోని ధనవంతులు లేదా ఉన్నత వర్గాల వారి సమాధులని తెలుస్తోంది. బ్యాంకాక్కు నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ‘ఇనుప యుగం’ నాటిదిగా గుర్తించారు. వచ్చే నెలతో ఈ తవ్వకాలు ముగియనున్నాయి.
హర్యానా రాఖీగఢీ అస్థిపంజరాలపై శాస్త్రీయ పరిశోధన..
మరోవైపు భారతదేశంలో ప్రసిద్ధ సింధు లోయ నాగరికత స్థలమైన హర్యానాలోని ‘రాఖీగఢీ’లో లభించిన మానవ అస్థిపంజరాలను పురాతత్వ శాఖ (ASI), మానవ శాస్త్ర పరిశోధన సంస్థ (AnSI)కి అప్పగించింది.
రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఈ అస్థిపంజరాలపై అత్యాధునిక శాస్త్రీయ విశ్లేషణలు జరగనున్నాయి. దీనివల్ల సింధు-సరస్వతి నాగరికత ప్రజల జీవన విధానం, వారి జన్యువులు (DNA), ఆరోగ్య పరిస్థితులపై కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి. దాదాపు 550 హెక్టార్లలో విస్తరించి ఉన్న రాఖీగఢీ, సింధు నాగరికతలోనే అతిపెద్ద నగరంగా పరిగణించబడుతుంది. ఇక్కడి తవ్వకాల్లో అద్భుతమైన నగర ప్రణాళిక, అధునాతన డ్రైనేజీ వ్యవస్థ, హస్తకళల వర్క్షాపులు .. అంతర్జాతీయ వ్యాపార సంబంధాల ఆధారాలు లభించాయి.

