తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తూ ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ఆధ్వర్యంలో వినూత్నంగా ‘మీటికెట్’ (MeeTicket) యాప్ను టీజీఎస్ ఆర్టీసీ రూపొందిస్తోంది. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ అభివృద్ధి చెందుతోంది. దీనిద్వారా ఆర్టీసీ, మెట్రో, ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఒకే డిజిటల్ వేదికపైకి అనుసంధానమవుతాయి. ఈ యాప్ ద్వారా ప్రయాణికుడు ఒకే చోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్తో పాటు, తన గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదా క్యాబ్ను కూడా ముందస్తుగా బుక్ చేసుకునే వీలుంటుంది. వినియోగదారుడు తనకు కావలసిన రవాణా విధానాన్ని ఎంచుకుని, ఒకే టికెట్ ద్వారా సమగ్రమైన ప్రయాణ అనుభవాన్ని పొందేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది.
ఈ ‘మీటికెట్’ యాప్ ఒక ఉమ్మడి డిజిటల్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది. దీని ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర రవాణాదారులు భాగస్వాములుగా చేరి, ప్రయాణికులకు నేరుగా సేవలు అందించి లబ్ధి పొందవచ్చు. ఇందులో చెల్లింపుల ప్రక్రియను కూడా చాలా సులభతరం చేశారు. ప్రయాణికులు చెల్లించిన రుసుమును ఆయా రవాణా విభాగాలు, భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా జమ చేసే ఆధునిక చెల్లింపుల వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతో పాటు రవాణా భాగస్వాములకు కూడా లావాదేవీల ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది.
మరోవైపు “ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నడుపుతుంది” అని ఇటీవల సోషల్ మీడియా, కొన్ని పత్రికల్లో జరుగుతున్న ప్రచారాలపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పష్టతనిచ్చింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం కానీ, వాటిని నిర్వహించడం కానీ చేయదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని యాజమాన్యం కోరింది. ‘మీటికెట్’ యాప్ ద్వారా కేవలం సేవలను అనుసంధానించడం తప్ప, ఆటోలను సొంతంగా నడిపే ఆలోచన లేదని తేల్చిచెప్పింది.

