TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!

Tg Bharath

Tg Bharath

TG Bharath: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత రెండు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. ఇందులో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ఆమోదించిన పరిశ్రమల విలువ రూ.11.77 లక్షల కోట్లుగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 10 లక్షల 32 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అన్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వృద్ధి గణనీయంగా తగ్గిందని మంత్రి అన్నారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎస్‌ఐపీబీ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నామని వివరించారు.

రాష్ట్ర భవిష్యత్ పారిశ్రామికాభివృద్ధిలో క్వాంటం వ్యాలీ కీలక పాత్ర పోషించనుందని ఆయన తెలిపారు. క్వాంటం వ్యాలీతో పాటు స్టీల్ ప్లాంట్లు, స్పేస్ అండ్ డ్రోన్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, సర్క్యులర్ ఎకానమీ పాలసీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో ప్రభుత్వం ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు వివిధ శాఖలకు సంబంధించి 26 విధానాలను రూపొందించగా.. అందులో 6 విధానాలు పరిశ్రమల శాఖకు సంబంధించినవేనని తెలిపారు.

దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 24.3%నికి చేరుకుందని పేర్కొన్న మంత్రి, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలకు అవసరమైన అనుమతులను వేగంగా అందిస్తున్నామని తెలిపారు. అలాగే భూ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రైవేట్ పార్క్ పాలసీ ఉపయోగపడుతోందని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయగా.. వాటిలో శ్రీ సిటీ ప్రధానమైనదని తెలిపారు. ఎంఎస్‌ఎంఈల ఆధ్వర్యంలో మరో ఏడు పార్కులను ప్రారంభించామని వెల్లడించారు.

ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” అనే లక్ష్యంతో యువతను పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలోని ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. అలాగే రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో పాటు క్లస్టర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

శ్రీహరికోట కేంద్రంగా స్పేస్ సిటీతో పాటు స్పేస్ టూరిజాన్ని కూడా అభివృద్ధి చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా రూ.500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న భవ్య పార్కుల్లో కనీసం మూడు నుంచి నాలుగు పార్కులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎయిర్‌స్పేస్, డిఫెన్స్ సిస్టమ్స్‌కు సంబంధించిన అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని.. రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే అనేక ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.