హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన బాధ్యతను ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే నెల చివరిలోగా టెండర్లు ఆహ్వానించాలని భావిస్తోంది. 181.5 కి.మీ మేర ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించనున్నారు. నిర్మాణ వ్యయం రూ.600 కోట్ల నుంచి రూ.700 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఏపీ-తెలంగాణ మధ్య ఈ హైవే వారధిలా ఉంటుంది. పండగల సమయంలోనేతై ఈ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. కి.మీ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు వరుసలుగా ఉండగా.. విస్తరణ చేపట్టాలనే ఎప్పట్నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇటీవల భేటీ అయ్యారు. రోడ్డు విస్తరణపై కేంద్రమంత్రితో కోమటిరెడ్డి చర్చించగా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఈ రహదారిని ఆరు వరుసలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రహదారి విస్తరణకు కసరత్తు మెుదలైంది. ఈ రహదారి విస్తరణ డీపీఆర్ రూపొందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది.