Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్

Bhujanga Rao Bail

Bhujanga Rao Bail

Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భుజంగరావును అరెస్ట్ చేసిన ఏసీబీ పోలీసులు తాజాగా జడ్జీ ముందు ప్రవేశ పెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జడ్జీ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను ఏసీబీ అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిన్న(బుధవారం) హైదరాబాద్‌తో పాటు 15 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇక నిన్న(బుధవారం) భుజంగరావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు కొనసాగాయి. భుజంగరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలించారు. భుజంగరావుతో పాటు ఆయన బంధువులకు చెందిన ఇళ్లు, ఇతర ఆస్తుల వద్ద సైతం ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సోదాల్లో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తుల పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం భుజంగరావు ఆస్తుల విలువ రూ.5.92 కోట్లుగా లెక్కగట్టారు. మార్కెట్లోకి వాటి విలువ పది రెట్లు ఉండొచ్చని ఏసీబీ అభిప్రాయపడుతోంది.