TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్‌లో ప్రాక్టికల్స్..

Intermediate Exams

Intermediate Exams

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో విద్యా మండలి (TGBIE) విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో పరీక్షా సరళిని మరియు మార్కుల కేటాయింపును పూర్తిగా సవరించింది. ఈ నూతన విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీల్లో గతంలో కేవలం రెండో సంవత్సరంలోనే ఉన్న 30 మార్కుల ప్రాక్టికల్స్‌ను ఇప్పుడు రెండు సంవత్సరాలకు విభజించారు. దీని ప్రకారం మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో సంవత్సరంలో 15 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించగా, థియరీ పరీక్ష 60 మార్కులకు పరిమితం అవుతుంది.

గణితం (Maths-A And B) సబ్జెక్టుల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో 75 మార్కులకు ఉన్న థియరీ పరీక్షను 60 మార్కులకు కుదించి, మిగిలిన 15 మార్కులను ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’ (ABL) ద్వారా ఇంటర్నల్ అసెస్‌మెంట్ కింద ప్రతి ఏటా కేటాయిస్తారు. అదేవిధంగా భాషా సబ్జెక్టులు మరియు హ్యుమానిటీస్ (కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ) గ్రూపులకు 20 మార్కుల ఇంటర్నల్ అసెస్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఈ సబ్జెక్టుల థియరీ పరీక్షలు 100 మార్కుల నుంచి 80 మార్కులకు తగ్గుతాయి. MEC విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 80 మార్కుల థియరీ, 20 మార్కుల ఇంటర్నల్స్ కలిగిన క్వశ్చన్ పేపర్‌ను రూపొందించారు.

విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో ‘ACE’ అనే సరికొత్త గ్రూపును బోర్డు ప్రారంభించింది. పాఠ్యపుస్తకాలను కూడా నిపుణుల కమిటీ ద్వారా ఆధునీకరించి, క్యూఆర్ కోడ్‌లు, సిమ్యులేషన్స్, డయాగ్రమ్స్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ వంటి అంశాలను జోడించారు. సవరించిన ఈ నూతన పాఠ్యపుస్తకాలు జూన్ 1, 2026 లోపు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్పులన్నీ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి మరియు కేవలం మార్కుల కోసమే కాకుండా విషయ పరిజ్ఞానం కోసం చదివేలా ప్రోత్సహించడానికి దోహదపడనున్నాయి.