తెలంగాణ రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళల సంక్షేమమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న డ్వాక్రా మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 46 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఈ పథకం కింద 30 రకాల అత్యవసర వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల భాగస్వామ్యంతో ఈ పరీక్షలు నిర్వహించనుండగా.. రాబోయే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల ఆరోగ్యంపై పూర్తి అవగాహన పెంచుకోవడంతో పాటు.. వారికి ఒక శాశ్వత డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించడం ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు.
Also Read:Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!
ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం మూడు విడతల ప్రణాళికను సిద్ధం చేసింది. మొదటి విడతలో భాగంగా ప్రతి జిల్లా నుంచి ప్రాధాన్యత కలిగిన 5 మండలాలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రెండో విడతలో మరో 10 మండలాలను చేర్చుతారు. ఇక చివరి విడతలో రాష్ట్రంలోని మిగిలిన అన్ని మండలాల్లోని మహిళలకు స్క్రీనింగ్ పూర్తి చేసి.. వైద్య సేవలు అందిస్తారు.
Also Read:Arjun Tendulkar Wedding: పెళ్లితో ఒక్కటైన అర్జున్-సానియా జంట.. హాజరైన ప్రముఖులు
కేవలం మహిళలే కాకుండా.. చిన్నారుల ఆరోగ్యంపై కూడా సర్కార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. మార్చి 6 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు , ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా విద్యార్థుల్లో రక్తహీనత సమస్యను గుర్తించి.. వారికి అవసరమైన చికిత్స.. పౌష్టికాహార సలహాలను అందించనున్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. జూన్ 12 వరకు చేపట్టాల్సిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను విడుదల చేశారు. దీని ప్రకారం.. సబ్ సెంటర్ల పరిధిలో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ టెస్టులు చేపడతారు. డయాలసిస్ రోగులకు వైరల్ ఇన్ఫెక్షన్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, డే-కేర్ క్యాన్సర్ సెంటర్లలో కీమోథెరపీ సేవలను మరింత మెరుగుపరుస్తారు.
Also Read:Bihar: బీహార్ సీఎంగా బీజేపీ వ్యక్తి.. జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పోస్ట్లు!
రాబోయే ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. మే 16 నుంచి పట్టణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను (UPHC) పాలీక్లీనిక్స్గా మార్చడంతో పాటు.. బస్తీలలో మొబైల్ వాహనాల ద్వారా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
