Revanth Reddy: గవర్నర్‌ను కలిసిన రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతల బృందం!

Congress Leaders Telanagana

Congress Leaders Telanagana

తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కాంగ్రెస్‌ నేతల బృందం కలిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ.. గవర్నర్‌కు లేఖ అందజేశారు. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సహా ముఖ్య నేతలు మాణిక్‌రావ్‌ ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

ఈ రోజు సాయంత్రమే సీఎల్పీ భేటీ జరుగుతుందని, రేపు సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని అంత భావించినా.. అలా జరగలేదు. సోమవారం ఉదయం 9.30 గంటకు సీఎల్పీ భేటీ ఉంటుందని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు. ఈ భేటీకి కొత్తగూడెంలో గెలిచిన సీపీఐ ఎమ్మెల్యేను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ భేటీలో సీఎం అభ్యర్థిని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. డిప్యూటీగా సీనియర్ నేత భట్టి విక్రమార్క అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మొత్తం 119 సీట్లకు జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-సీపీఐలు కలిసి 65 సీట్లను గెలవగా.. అధికార బీఆర్‌ఎస్‌ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది.