NTV Telugu Site icon

KCR: దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలి

దేశంలో ఉన్న దళితుల బాగోగుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దళితుల రిజర్వేషన్లు 19% పెంచడానికి, BCల కులగణన కోసం, దేశమంతా దళితబంధు పెట్టడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నానని తెలిపారు. దేశం బాగుపడాలంటే.. అందరికీ సమాన హక్కుల కోసం రాజ్యాంగం మారాలని అభిప్రాయపడ్డారు. 77 శాతం దేశ సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కోసం కొత్త రాజ్యాంగం రాయాలని కేసీఆర్ అన్నారు.

అటు ప్రధాని మోదీ అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇవ్వడంపైనా కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా ఎన్నికలు అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు. అమెరికా ఎన్నికలతో మీకేం సంబంధం.. ఎవరైనా వేరే దేశం ఎన్నికల్లో ప్రచారం చేస్తారా.. ఇది విదేశీ నీతేనా..? అని ప్రశ్నించారు. బుద్ది ఉన్న ప్రధాని ఎవరైనా.. ఇతర దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా అని నిలదీశారు. మరోవైపు హిజాబ్ వివాదంపైనా కేసీఆర్ స్పందించారు. ఈ వివాదంపై ప్రధానితో పాటు దేశం మొత్తం మౌనం వహిస్తోందని.. అంతర్యుద్ధం చెలరేగితే దేశం గతేంటని.. కర్ణాటక పరిస్థితి దేశ వ్యాప్తంగా వస్తే పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని నిలదీశారు. శాంతిభద్రతలు కోరుకుందామా? ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా? అనేది యువత ఆలోచించుకోవాలన్నారు. శాంతి లేని చోట పెట్టుబడులు ఎవరు పెడతారని కేసీఆర్ మండిపడ్డారు.