Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Ap Rains Prediction 2026

Ap Rains Prediction 2026

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని, వర్షాల సమయంలో అనవసరంగా బయటకు రాకూడదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం, ఏలూరు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.

కోస్తాంధ్ర తీరప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. వర్షాల వల్ల నిత్యజీవితానికి, రవాణా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు రెవెన్యూ, స్థానిక సంస్థల యంత్రాంగం అప్రమత్తమైంది. వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.