Bow and Arrow Symbol: ఉద్ధవ్‌-షిండే వర్గాలకు ఈసీ షాక్‌.. శివసేన ‘విల్లు బాణం’ గుర్తు ఫ్రీజ్

Shivsena

Shivsena

Bow and Arrow Symbol: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన గుర్తు అయిన “విల్లు – బాణం”ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉపఎన్నికల కోసం ఎల్లుండిలోగా మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని ఉద్ధవ్, షిండే వర్గాలకు సూచించింది. ముంబైలోని ఈస్ట్ అంధేరి నియోజకవర్గానికి సంబంధించిన ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరగనున్న సంగతి తెలిసిందే. శివ‌సేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేల‌ను త‌న వైపున‌కు తిప్పుకున్న షిండే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో శివ‌సేన త‌మ‌దంటే కాదు… త‌మ‌ద‌ని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, షిండే వ‌ర్గాలు వాదులాడుకుంటున్నాయి. ఈ వ్యవ‌హారం కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి చేరింది.

Exotic Animals Seized: అక్రమంగా తరలిస్తున్న 665 అరుదైన, అన్యదేశ జంతువులు సీజ్‌..

తాజాగా శ‌నివారం ఉద్ధవ్‌తో పాటు షిండే వ‌ర్గానికి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఓ నోటీసు జారీ చేసింది. శివ‌సేన‌కు ఇప్పటిదాకా కొన‌సాగుతున్న ఎన్నిక‌ల గుర్తు విల్లంబును ఇరు వ‌ర్గాలూ వినియోగించడం కుద‌ర‌ద‌ని ఎన్నిక‌ల సంఘం తెలిపింది. రెండు వ‌ర్గాల మ‌ధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు క‌మిష‌న్ తెలిపింది. అంతేకాకుండా త్వర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌కు రెండు వ‌ర్గాలు త‌మ త‌మ గుర్తుల‌ను ఎంచుకోవాల‌ని… అది కూడా రెండు రోజుల్లోగా త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేయాల‌ని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది, ఇప్పుడు ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లో జరగబోయే ఉప ఎన్నికల్లో వేరే పేరు, గుర్తును ఉపయోగించాల్సి ఉంటుంది. అంధేరీ ఈస్ట్ ఉపఎన్నికలో ఏకనాథ్ షిండే వర్గం పోటీ చేయడం లేదు. జూన్‌లో విడిపోయినప్పటి నుండి, బాల్ థాక్రే వారసత్వాన్ని కలుషితం చేశారని ఇరు వర్గాలు మరొకరిపై ఆరోపణలు చేస్తున్నాయి.