Sabitha Indra Reddy: టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. పూర్తి పారదర్శకతతోను, జవాబుదారితనంతోను, లోపాలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మార్గదర్శకాలు, షెడ్యూల్ కు సంబంధించి త్వరితగతిన తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Read Also: Hotel Bill : లగ్జరీ హోటళ్లో దిగాడు.. లక్షల బిల్లు ఎగ్గొట్టాడు
ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని అధికారులను కోరారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటున్నందున ఇందుకోసం వినియోగించే సాఫ్ట్ వేర్ లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. పదోన్నతులు, బదిలీల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని, ఈ ప్రక్రియకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. బదిలీ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేలా వివిధ స్థాయిల్లో అధికారుల బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షలుగా నియమించాలని సూచించారు.