OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..

  • ఎమ్మెల్యే అఖిలప్రియకు టీడీపీ అధిష్టానం స్ట్రాంగ్‌ వార్నింగ్‌?..
  • ఎమ్మెల్యే భర్త భార్గవ్‌రామ్‌ జోక్యంపై తీవ్ర విమర్శలు..
  • అహోబిలం మఠం వివాదంతో అధిష్టానం అలర్ట్‌ అయిందా?..
  • ఆళ్ళగడ్డ వ్యవహారాలపై పార్టీ పెద్దలకు వరుస ఫిర్యాదులు
Otr

Otr

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాల్లో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఒకటని చెబుతారు. ఇక్కడ నిత్యం వివాదాలు, ఆరోపణలు, అనుచరుల వసూళ్లు, దౌర్జన్యాలు…ఇలా ఎప్పుడూ ఏదో ఒక వార్త రన్‌ అవుతూనే ఉంటుంది. దీంతో టీడీపీ ప్రతిష్టతోపాటు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు కూడా చెడ్డపేరు వస్తోందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… అఖిలప్రియను పార్టీ అధిష్టానం పిలిపించి నియోజకవర్గంలోని పరిస్థితులు వివరించడంతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆళ్లగడ్డ ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో ఎమ్మెల్యే భర్త భార్గవరామ్ జోక్యంపై విమర్శలు పెరిగిపోతున్నాయి. చాలా రోజుల నుంచి ఈ వ్యవహారాలు పార్టీ దృష్టిలో ఉన్నా…అహోబిలం ఆలయ వివాదంతో ఇక ఉపేక్షిస్తే లాభం లేదని అనుకున్నారట టీడీపీ పెద్దలు.

అందుకే ఇక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో అధిష్టానం పిలిపించినట్టు చెబుతున్నారు. ఆళ్లగడ్డలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఇటీవల టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయట. నియోజకవర్గ వ్యవహారాల్లో ఎమ్మెల్యే భర్త భార్గవ రామ్ జోక్యం మితిమీరిపోయిందని, ఆయన అనుచరులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారంటూ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు గట్టిగానే వెళ్ళినట్టు తెలిసింది. అందుకే అక్కడి పరిస్థితిని చక్కదిద్దాలంటే ముందు భార్గవ్ రాం జోక్యాన్ని తగ్గించాలని భావించారట టీడీపీ పెద్దలు. అందుకే అఖిలప్రియను పిలిచి గట్టిగా చెప్పినట్టు సమాచారం. అదే సమయంలో ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డిపై హత్యకు కుట్ర, హైద్రాబాద్‌లో కిడ్నాప్ వంటి కేసులను ఉదహరిస్తున్నారట పార్టీలోని ఎమ్మెల్యే వ్యతిరేకులు.

ఇక్కడ గతంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి హయాంలో ఉన్న రాజకీయాలకు, ఇప్పటి పాలిటిక్స్‌కు చాలా తేడా ఉందని ఓపెన్‌గానే కామెంట్‌ చేస్తున్నారు కొందరు. నాగిరెడ్డి హయాంలో ఫ్యాక్షన్, ప్రత్యర్థి పార్టీ నేతలతో గొడవలు, కాంట్రాక్టర్లతో వివాదాలు ఉంటే….ఇపుడు మాత్రం సామాన్యులు, చిన్న వ్యాపారులు, చివరికి చికెన్ షాపులు, ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే స్థాయికి చేరుకున్నాయంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే అఖిల, భార్గవ్ రాం అనుచరుల తీరే ఇందుకు కారణం అని చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా… ఇద్దరి పేర్లు చెప్పి అరాచకాలకు పాల్పడుతున్నారన్నది లోకల్‌ వాయిస్‌. ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లి వద్ద సీల్ కంపెనీ సోలార్ ప్లాంట్ పనుల్ని అనుచరులు వెళ్లి అడ్డుకోవడం, బెదిరించడంతో కంపెనీ ప్రతినిధులు ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.

అక్కడి నుంచి సీఎం ఆఫీసుకి ఫోన్‌ రావడం, సీఎంవో జోక్యం అప్పట్లో సంచలనం రేపింది. ఆ రకంగా ఆళ్లగడ్డ వ్యవహారాలు అధిష్టానానికి తల బొప్పికట్టిస్తున్నాయట. ప్రభుత్వ జోక్యం లేకుండా నిర్వహించే అహోబిలం మఠం వ్యవహారాల్లో అఖిలప్రియ జోక్యం చేసుకోవడం, బహిరంగ చర్చ అంటూ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డితో వివాదం వీధికెక్కడంతో అధిష్టానం జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. అహోబిలం మఠం వ్యవహారాల్లో ఎవరూ తల దూర్చవద్దని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చిందట. ఆలయానికి చెందిన నిధులు తమిళనాడుకు వెళ్తున్నాయని, అందుకే అడ్డుకున్నామన్న భూమా అఖిల వివరణతో పార్టీ పెద్దలు సంతృప్తి చెందలేదని తెలిసింది.

అలాగే… నియోజకవర్గ విషయాలలో భర్త జోక్యం ఉండకూడదని చాలా స్పష్టంగా ఎమ్మెల్యేకి చెప్పినట్టు సమాచారం. ముందసలు అధిష్ఠానం నుంచి తనకు పిలుపే లేదని చెప్పిన ఎమ్మెల్యే ఆ మరుసటి రోజే వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. అయితే… ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా పెద్ద సెన్సేషన్ అవుతోందని, అది వాస్తవమా, కాదా అని చూడకుండా హైప్ చేస్తున్నారని, నాకు నేనుగా వచ్చి అధిష్టానానికి చెప్పానంటూ వివరణ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే. మొత్తం మీద ఆళ్లగడ్డ పరిస్థితులను నిశితంగా గమనిస్తోందట టీడీపీ అధిష్టానం. దీంతో… పెద్దలు పిలిచి మరీ హెచ్చరించాక అయినా అఖిలప్రియ భర్త భార్గవ రాం జోక్యం నియోజకవర్గ వ్యవహారాల్లో తగ్గుతుందా? లేక ఎవరేం చెబితే మాకేంటన్నట్టు ముందుకే వెళ్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.