కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు అందరిని షాక్ కు గురిచేసింది. వివరాలలోకెళితే సినిమా నిర్మాణ వ్యయంలో స్టార్ హీరోలు, అగ్ర దర్శకుల పారితోషికాలకే బడ్జెట్ సరిపోతుండటంతో నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చెన్నైలో ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో నిర్మాతల మండలి ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలకు ఇకపై అడ్వాన్స్ రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని, రెవిన్యూ షేరింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
రెవిన్యూ షేర్ విధానం : ఈ కొత్త నిబంధన ప్రకారం అగ్ర హీరోల నుంచి చిన్న స్థాయి టెక్నీషియన్ల వరకు ఎవరికీ సినిమా ప్రారంభంలో లేదా షూటింగ్ సమయంలో కోట్లలో పారితోషికం ఇవ్వరు. సినిమా పూర్తయి, విడుదలయ్యాక వచ్చే థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ అమ్మకాలలో అందరికీ వాటా ఇస్తారు. సినిమా హిట్టయి లాభాలు వస్తే అందరూ పంచుకుంటారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే ఆ నష్టాన్ని కూడా నటీనటులు సాంకేతిక నిపుణులు భరించాల్సి ఉంటుంది. దీనివల్ల కేవలం సినిమా మేకింగ్కు మాత్రమే ఖర్చు అవుతుంది కాబట్టి నిర్మాతపై ఆర్థిక భారం తగ్గుతుంది.
సమ్మెకు సై : ఈ నిర్ణయానికి వ్యతిరేకత వస్తే మే 2వ తేదీన టోకెన్ స్ట్రైక్ నిర్వహించాలని అప్పటికీ నడిగర్ సంఘం (తమిళ నటీనటుల సంఘం) సహకరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే రజనీకాంత్ వంటి అగ్ర హీరోలు గతంలోనే లాభాల్లో వాటా తీసుకునే పద్ధతిని ప్రోత్సహించారు. కానీ నేటితరం యంగ్ స్టార్స్ ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
టాలీవుడ్ సంగతేంటి : తమిళ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లోనూ చర్చనీయాంశమైంది. తెలుగులో కూడా అగ్ర హీరోల రెమ్యునరేషన్లు రూ. 100 కోట్లు దాటుతున్నాయి. ఒకవేళ ఇదే విధానం ఇక్కడ అమలైతే పరిస్థితి ఏంటి. గ్లోబల్ మార్కెట్ ఉన్న మన హీరోలు ఈ షేర్ విధానానికి ఒప్పుకుంటారా. చిన్న నిర్మాతలకు ఇది వరమే అయినా పెద్ద సినిమాల విషయంలో స్పష్టత రావలసి ఉంది. మొత్తానికి కోలీవుడ్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుందో లేదో చూడాలి.
