CM Vijay: దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) వివాదం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. లోక్సభ స్థానాల సంఖ్యను శాశ్వతంగా 543 వద్దే నిలిపివేసేలా తక్షణమే రాజ్యాంగ సవరణలు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి గురువారం లేఖ రాశారు. ఈ అంశంపై బుధవారం తమిళనాడు శాసనసభలో ఆమోదించిన ప్రత్యేక తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, దక్షిణాది హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఆయన ప్రధాని దృష్టికి కొన్ని కీలక అంశాలను తీసుకెళ్లారు. లేఖలోని వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న లోక్సభ మొత్తం స్థానాల సంఖ్య 543ని శాశ్వతం చేయడంతో పాటు, ప్రస్తుతం ఏ ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సంఖ్యను కూడా యథాతథంగా కొనసాగించాలని విజయ్ డిమాండ్ చేశారు. కొత్త సెన్సస్ (జనాభా లెక్కల) ఆధారంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(ఎ) ప్రకారం సీట్ల కేటాయింపు చేపడితే దక్షిణాది రాష్ట్రాలు తమ లోక్సభ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అంటే 1967 పునర్విభజన సమయంలో కూడా తమిళనాడు తన లోక్సభ స్థానాలను 41 నుంచి 39కి కోల్పోవాల్సి వచ్చిందని, మళ్లీ అలాంటి చారిత్రక తప్పిదం పునరావృతం కాకూడదని లేఖలో స్పష్టం చేశారు.
జనాభా నియంత్రణ కార్యక్రమాలను ఎంతో సమర్థవంతంగా అమలు చేసి, ఆర్థిక ప్రగతి, వైద్యం, ప్రజారోగ్యం, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేయడం ఎంతవరకు సమంజసమని తీర్మానం ప్రశ్నించింది. 1971 తదుపరి జనాభా ఆధారంగా స్థానాలను మార్చితే, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందని విజయ్ పేర్కొన్నారు. దీంతో పాటు, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా లేఖలో ప్రస్తావించారు. రాబోయే లోక్సభ ఎన్నికలతో పాటు, ఆ తర్వాత జరిగే అన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి, అవసరమైన రాజ్యాంగ సవరణలను తక్షణమే తీసుకురావాలని లేఖ ద్వారా సీఎం విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

