Pakistan-Afghanistan: పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజీకి చేరాయి. పాకిస్థాన్ భూభాగంపై ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబాన్ దళాలు డ్రోన్ దాడులతో విరుచుకుపడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ (ISIS-K) ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తాము ఈ వైమానిక దాడులు చేసినట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్ఘనిస్థాన్లోని సామాన్య పౌరులపై దాడులు, విధ్వంసకర కుట్రలు పన్నేందుకు ఈ స్థావరాలను వాడుకుంటున్నారని, అందుకే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఆఫ్ఘన్ మీడియా సంస్థ టోలో న్యూస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తాలిబాన్ ప్రకటనను ఉటంకించింది. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని, అయితే పౌరులెవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆఫ్ఘన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సరన్ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలను ఐసిస్ ఉగ్రవాదులు తమ రహస్య స్థావరంలా వాడుకుంటున్నారని, దాన్నే తాము టార్గెట్ చేశామని తాలిబాన్లు వెల్లడించారు.
అయితే, తాలిబాన్లు ఈ డ్రోన్ దాడులకు దిగడం వెనుక పెద్ద కారణమే ఉంది. దీనికి సరిగ్గా రెండు రోజుల ముందే (ఆదివారం) ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ దళాలు భీకరమైన వైమానిక దాడులకు తెగబడ్డాయి. ఈ పాక్ దాడుల్లో కనీసం 28 మంది అమాయక పౌరులు మరణించారని, మరో 49 మంది గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యునామా’ (UNAMA) ప్రకటించింది. కానీ, అటు ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ మాత్రం పాక్ దాడుల వల్ల మహిళలు, పిల్లలతో కలిపి ఏకంగా 38 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది క్షతగాత్రులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పాకిస్థాన్ భద్రతా దళాలు మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. తాము కేవలం ఉగ్రవాదులనే లక్ష్యంగా చేసుకున్నామని, తమ వైమానిక, భూతల ఆపరేషన్లలో 29 మంది ఉగ్రవాదులు ఖతమయ్యారని సమర్థించుకున్నాయి. గత ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య దశాబ్ద కాలంలోనే అత్యంత ఘోరమైన పోరు జరగ్గా, ఆ తర్వాత పాకిస్థాన్ ఇలా ఆఫ్ఘన్ భూభాగంపై దాడి చేయడం ఇది రెండోసారి. దీంతో మాజీ మిత్రదేశాలైన ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని యుద్ధ వాతావరణం నెలకొంది.
ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన ఈ వైమానిక దాడులను భారతదేశం తీవ్రస్థాయిలో ఖండించింది. పొరుగు దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ పాక్ చేసిన ఈ పనిని ” blatant act of aggression” (బహిరంగ దురాక్రమణ చర్య)గా భారత్ అభివర్ణించింది. ఇది ప్రాంతీయ శాంతి భద్రతలకు ప్రత్యక్ష ముప్పు అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించింది. అమాయక మహిళలు, పిల్లల మరణాలకు కారణమైన పాకిస్థాన్ వైఖరి అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని తూర్పారబట్టింది. తన సొంత దేశంలో ఎదురవుతున్న అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే పాకిస్థాన్ సరిహద్దులు దాటి ఇలాంటి తీవ్రవాద చర్యలకు, హేయమైన దాడులకు ఒడిగడుతోందని భారత్ ఘాటుగా విమర్శించింది. తమ దేశంలో జరుగుతున్న ఉగ్ర దాడులన్నింటికీ ఆఫ్ఘనిస్తానే ఆశ్రయం ఇస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండగా, ఉగ్రవాదం అనేది పాకిస్థాన్ అంతర్గత సమస్య మాత్రమేనని, తమకు దాంతో ఎలాంటి సంబంధం లేదని కాబూల్ (తాలిబాన్ ప్రభుత్వం) గట్టిగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య నడుస్తున్న ఈ డ్రోన్లు, ఎయిర్ స్ట్రైక్ల పర్వం ఆసియా ఖండంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

