BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం..విచారణకు సుప్రీంకోర్టు ఓకే

Supreme Court

Supreme Court

గుజరాత్ అల్లర్లు, ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోంది. ఇది భారత్‌లో ప్రసారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం వచ్చే వారం విచారిస్తామని వెల్లడించింది. వీటిని చూసే పౌరులను ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని.. ఈ నేపథ్యంలో దీనిపై దాఖలైన పిల్‌లను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరారు. పరిశీలించిన చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే సోమవారం వీటిని విచారిస్తామని వెల్లడించింది.

Taraka Ratna Health Update: అవన్నీ రూమర్స్‌.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నందమూరి రామకృష్ణ ప్రకటన

బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై తాము దాఖలు చేసిన పిటిషన్లను అత్యవసర జాబితాలో చేర్చి విచారించాలని సీనియర్‌ జర్నలిస్ట్‌ ఎన్‌ రామ్‌, సామాజిక కార్యకర్త, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తరఫున న్యాయవాదులు ఎంఎల్‌ శర్మ, సీనియర్‌ అడ్వకేట్‌ సీయూ సింగ్‌లు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పౌరులు, విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారని.. అందుకే దయచేసి ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని కోరారు. అలాగే 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్లపై వచ్చే నివేదికలు, వార్తలు, వాస్తవాలను చూసే హక్కు పౌరులకు ఉందో లేదోననే విషయాన్ని కూడా సుప్రీం కోర్టు నిర్ణయించాలని న్యాయవాది ఎంఎల్‌ శర్మ తన పిల్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ జనవరి 21న ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరారు. వీటిని పరిశీలించిన చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జే బీ పార్దీవాలా ధర్మాసనం.. వచ్చే వారం విచారణ చేపడతామని తెలిపింది.

Bharat Jodo Yatra: మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్

కాగా, బీబీసీ డాక్యుమెంటరీని బ్లాక్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్న వారిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు మండిపడ్డారు. వేల మంది సామాన్యులు న్యాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో ఇలాంటి పిటిషన్లు వేయడం సుప్రీంకోర్టు విలువైన సమయాన్ని వృథా చేయడమేనన్నారు. బీబీసీ డాక్యుమెంటరీని ప్రజలు చూడకుండా ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం ధర్మాసనం అంగీకరించిందని వచ్చిన వార్తలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ విధంగా స్పందించారు.