ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ (IPL) సీజన్ అంతా ఆడి, తీరా న్యూజిలాండ్తో జరిగే ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ అందుబాటులో లేకపోవడం అంతర్జాతీయ క్రికెట్లో పెద్ద వివాదానికి దారితీసింది. దేశం కంటే ఆటగాళ్లు ఫ్రాంచైజీ లీగ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మైఖేల్ వాన్, సైమన్ డౌల్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అయితే, ఈ వివాదంపై భారత బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ తన ‘మిడ్-డే’ కాలమ్లో అత్యంత ఘాటుగా స్పందించారు. భారత క్రికెట్ను, బీసీసీఐ (BCCI)ని విమర్శించడం కొందరికి ఒక అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.
గావస్కర్ విమర్శకుల ద్వంద్వ నీతిని ఎండగడుతూ.. భారత క్రికెట్ను వేలెత్తి చూపించే వారే, తిరిగి తమ బోర్డుల ఆదాయం కోసం బీసీసీఐని ఆశ్రయిస్తారని స్పష్టం చేశారు. ఐపీఎల్లో ఆడే విదేశీ ఆటగాళ్ల జీతం నుంచి 10 శాతం రుసుమును బీసీసీఐ నేరుగా ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు చెల్లిస్తోందనే నిజాన్ని వీరంతా దాచిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“భారత క్రికెట్ను, బీసీసీఐని తిట్టడం ఒక ఫ్యాషన్గా మారింది. కానీ ఆదాయం విషయానికి వస్తే మాత్రం వారంతా బీసీసీఐ వైపే చూడాలి. ఎందుకంటే వారి దేశాల కంటే కూడా భారత క్రికెట్, భారతీయ అభిమానులే వారి ఖజానాలను ఎక్కువగా నింపుతున్నారు. ఐపీఎల్ వల్ల ప్రతి సంవత్సరం విదేశీ బోర్డులకు మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ రాబడి అందుతోంది. ప్రపంచంలోని మరే ఇతర లీగ్ (ది హండ్రెడ్ లేదా బిగ్ బాష్ లీగ్) ఇలా విదేశీ బోర్డులకు వాటా ఇవ్వడం లేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఇస్తోంది,” అని గావస్కర్ రాసుకొచ్చారు.
మరోవైపు.. మైఖేల్ వాన్ వంటి మాజీలు ఫ్రాంచైజీల కంటే టెస్ట్ క్రికెట్కే ప్రాధాన్యత ఇవ్వాలని వాదిస్తుండగా, సైమన్ డౌల్ మాత్రం గతంలో ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ వంటి కివీస్ బౌలర్లు ఐపీఎల్ ఆడుతూనే రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేసి టెస్టులకు సిద్ధమైన విషయాన్ని గుర్తు చేశారు. వీరందరికీ గావస్కర్ తనదైన శైలిలో సమాధానమిస్తూ.. “ఇకనైనా నిద్ర లేచి వాస్తవాలను గ్రహించండి. మీరు ఎంత కిందకు లాగాలని చూసినా భారత క్రికెట్ ఇక్కడే ఉంటుంది, మరింత బలంగా ఎదుగుతుంది” అని తేల్చి చెప్పారు.

