Ranil Wickremesinghe arrest: శ్రీలంకలో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను శుక్రవారం సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయన దేశ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వ్యక్తిగత ప్రయాణాల కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో సీఐడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి కార్యాలయానికి రావాలని పిలిచింది. ఆయన సీఐడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని ఇచ్చిన అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈక్రమంలో ఆయనను కొలంబో ఫోర్ట్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.
READ ALSO: Kurnool : తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
కథ అడ్డం తిప్పిన లండన్ పర్యటన..
2023 సెప్టెంబర్లో మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే లండన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారని CID చెబుతోంది. ఈ పర్యటన సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకున్నారని సీఐడీ వాదన. పలు నివేదికల ప్రకారం.. 2023 సెప్టెంబర్లో ఆయన క్యూబాలోని హవానాకు వెళ్లారు. అక్కడ జరిగిన G77 సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన తిరిగి వస్తుండగా లండన్లో ఆగి, తన భార్య ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘే స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ మొత్తం పర్యటన అధికారిక కార్యక్రమం కంటే వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని, ఈ ఖర్చులన్ని ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టారని CID ఆరోపించింది.
విక్రమసింఘే స్పందన..
మాజీ అధ్యక్షుడు CID ఆరోపణలను ఖండించారు. తన భార్య తన ప్రయాణ, బస ఖర్చులను స్వయంగా ఆమె భరించిందని, ప్రభుత్వ డబ్బును వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించలేదని స్పష్టం చేశారు. కేవలం ఇది రాజకీయ ప్రతీకార చర్యగా అని ఆయన అభివర్ణించారు. తగిన ఆధారాలు లభించిన తర్వాతే మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.