SRH vs RR: హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యే అవకాశముండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం పరిసరాల్లో 2000 మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు. అదనంగా 430 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచే ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేడియం చుట్టూ ప్రత్యేక ఆంక్షలు విధించారు. ప్రేక్షకుల వాహనాల కోసం 11 పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
ఈ మ్యాచ్తో డిజిటల్ టికెట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. ఫిజికల్ టికెట్ లేకపోయినా, మొబైల్లో ఉన్న QR కోడ్ చూపించినా స్టేడియంలోకి అనుమతిస్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్ అనంతరం ప్రేక్షకులను అలరించేందుకు ప్రత్యేక లేజర్ షో కూడా ఏర్పాటు చేశారు. ఇక నిబంధనల విషయానికి వస్తే.. లోపలికి ల్యాప్టాప్లు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్టేడియంలోకి అనుమతించరు. వాటర్ బాటిల్స్, సిగరెట్లు, లైటర్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. బ్యానర్లు, పదునైన వస్తువులు పూర్తిగా నిషేధించారు. గత మ్యాచ్లో స్మార్ట్ వాచ్లు, సన్ గ్లాసెస్, వాలెట్ లను అనుమతించకపోవడంతో, ఈసారి కూడా వాటిని తీసుకురావద్దని పోలీసులు సూచిస్తున్నారు. క్లాక్ రూమ్ సౌకర్యం లేకపోవడంతో ప్రేక్షకులు తమ వస్తువులను ఇంటి వద్దే ఉంచి రావాలని కోరుతున్నారు.
మ్యాచ్ పరంగా చూస్తే.. ఈ సీజన్లో అజేయంగా కొనసాగుతున్న రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్గా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన RR జట్టు అద్భుత ఫామ్లో ఉంది. ముఖ్యంగా 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీ జట్టుకు బలంగా నిలుస్తోంది. మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు హోమ్ గ్రౌండ్ లో తొలి విజయానికి ప్రయత్నిస్తోంది. నాలుగు మ్యాచ్లు ఆడిన SRH, మూడు మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. బ్యాటింగ్ బాగున్నప్పటికీ బౌలింగ్ విభాగం నిరాశపరుస్తోంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో, రెండు జట్లలోనూ హార్డ్ హిట్టర్లు ఉండటం వల్ల ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. మొత్తం మీద, అభిమానులకు ఇది హై స్కోరింగ్ థ్రిల్లర్గా మారే అవకాశం ఉంది.
