Shree Charani: అలుపెరగని ప్రయాణం.. పేదరికాన్ని జయించి, ప్రపంచ కప్ అందించిన ఆంధ్ర మహిళా క్రికెటర్

Shree Charani

Shree Charani

Shree Charani: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు క్రీడా రంగంలో పెద్దగా పేరు లేని ప్రాంతమైనా.. ఈ జిల్లాలోని వీరపునాయిని మండలం, ఎర్రమల్లె గ్రామానికి చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించింది. మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించి దేశానికే గర్వకారణంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మహిళల క్రికెట్‌లో ప్రపంచ కప్‌లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది.

Sportsmanship: గెలిచినా ఒదిగే ఉన్న టీమిండియా మహిళలు.. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే ఇదేగా.. వీడియో వైరల్..!

21 ఏళ్ల ఈ యువతి ప్రయాణం మాత్రం అనేక కష్టనష్టాల మధ్య సాగింది. వాస్తవానికి క్రికెట్ ఆమె మొదటి లక్ష్యం కాదు. చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపింది. అయితే 16 ఏళ్ల వయస్సులో మాత్రమే క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన కారణం. శ్రీ చరణి ఎదుర్కొన్న ప్రధాన అడ్డంకుల్లో ఆర్థిక సమస్యలు, కుటుంబం నుంచి మొదట్లో వచ్చిన వ్యతిరేకత ఉన్నాయి. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు. క్రికెట్ అప్పటికే పురుషుల క్రీడగా పరిగణించబడుతుండటంతో ఆమె తండ్రి మొదట్లో చరణి నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. ఆమె తండ్రిని ఒప్పించడానికి ఏకంగా ఒక సంవత్సరం పట్టింది. ఆమె క్రీడా జీవితాన్ని ప్రారంభించే సమయంలో వారి కుటుంబం అప్పులతో బాధపడేది. అయినప్పటికీ ఆ కష్టాలు తన ఆటపై ప్రభావం చూపకుండా ఆమె తల్లిదండ్రులు సహకరించారు.

Chevella Road Accident: మృత్యు ఘోష.. ప్రధాని దిగ్భ్రాంతి..! మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

క్రీడా జీవితం ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్‌గా శిక్షణ పొందిన శ్రీ చరణి వికెట్లు లభించకపోవడంతో స్పిన్ బౌలింగ్‌ను ప్రయత్నించగా అది బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా మారింది. కడప లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ద్వారా సెలెక్టర్ల దృష్టిలో పడింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంపిక కావడం ఆమెకు ఆట పట్ల ఉన్న పట్టుదలకు, కష్టపడే తత్వానికి నిదర్శనం. ఇక మహిళల ప్రపంచ కప్‌ 2025లో భారత బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత అత్యధికంగా 13 వికెట్లు తీసిన రెండో బౌలర్ గా శ్రీ చరణి నిలిచింది.