ఇండియాకు చెందిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అరంగేట్రంలోనే అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్లో అద్భుతమైన ప్రదర్శన చేసి రెండవ స్థానంలో నిలిచింది. పారిస్ పారాలింపిక్స్లో 16వ రౌండ్లోకి నేరుగా ప్రవేశించింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన 17 ఏళ్ల శీతల్ చేతులు లేకుండానే జన్మించి.. కాళ్లతో విలువిద్య చేస్తోంది. శీతల్ 720కి 703 పాయింట్లు సాధించి టర్కీకి చెందిన ఓజ్నూర్ గిర్డి క్యూర్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఒజ్నూర్ ర్యాంకింగ్ రౌండ్లో 704 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది.
Read Also: CM Chandrababu: ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగుజాతి తయారవ్వాలి..
శీతల్ ఈ నెలలో గ్రేట్ బ్రిటన్కు చెందిన ఫోబ్ పైన్ ప్యాటర్సన్ నెలకొల్పిన 698 ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచ రికార్డును అధిగమించింది. తాజాగా.. శీతల్ ను ఓజ్నూర్ అధిగమించడంతో రెండో స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్ రౌండ్లో శీతల్తో సహా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఆర్చర్లు 32 రౌండ్లో బై పొందారు.. ఈ క్రమంలో.. వారు శనివారం జరిగే రౌండ్-16లో పాల్గొంటారు. చిలీకి చెందిన మరియానా జునిగా, కొరియాకు చెందిన చోయ్ నా మి మధ్య జరిగే రౌండ్ ఆఫ్ 32 విజేతతో శీతల్ తలపడుతుంది. ఈ ఆర్చర్లిద్దరూ ర్యాంకింగ్ రౌండ్లో వరుసగా 15వ, 18వ ర్యాంక్లలో నిలిచారు. టోక్యో పారాలింపిక్స్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో జునిగా రజత పతకాన్ని గెలుచుకుంది.
Read Also: Devara: దేవర హైప్.. సరిపోదా??
గత ఏడాది చైనాలోని హాంగ్జౌలో జరిగిన పారా ఆసియా క్రీడల్లో ఒకే సీజన్లో రెండు బంగారు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా శీతల్ చరిత్ర సృష్టించింది. రజత పతక రూపంలో మూడో పతకాన్ని కూడా సాధించింది. హాంగ్జౌలో జరిగిన మహిళల వ్యక్తిగత కంపౌండ్, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో ఆమె బంగారు పతకాలను గెలుచుకుంది. అంతేకాకుండా.. మహిళల డబుల్స్లో రజత పతకాన్ని గెలుచుకుంది. శీతల్.. ఫోకోమెలియా సిండ్రోమ్ అనే అరుదైన పుట్టుకతో వచ్చే రుగ్మతతో జన్మించింది. ఈ క్రమంలో.. ఆమె అవయవాలు అభివృద్ధి చెందలేదు.
