Saudi Arabia: భారతదేశంతో సహా 40 దేశాల నుంచి కోడి మాంసం, గుడ్లు సహా పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడాన్ని సౌదీ అరేబియా తాజాగా నిషేధించింది. పలు నివేదికల ప్రకారం.. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి, దేశ మార్కెట్లో ఆహార భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయడానికి ముందు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఈ జాబితాను కాలానుగుణంగా మార్చవచ్చని SFDA పేర్కొంది.
READ ALSO: నిరీక్షణకు ఇక సెలవు.. Motorola Edge 70 Fusion స్మార్ట్ ఫోన్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్!
సౌదీ అరేబియా 2004 నుంచి కోడి మాంసం, గుడ్లు సహా పౌల్ట్రీ ఉత్పత్తుల విషయంలో కొన్ని దేశాలను నిషేధించింది. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) వంటి వ్యాధుల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని, ప్రమాద అంచనాలు, అంతర్జాతీయ నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గల్ఫ్ న్యూస్ ప్రకారం.. దిగుమతి జాబితాలో సౌదీ తీసుకున్న నిర్ణయం ఇటీవల సంవత్సరాలలో అతిపెద్ద మార్పులలో ఒకటిగా చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ ముస్లిం దేశం పూర్తిగా నిషేధించిన 40 దేశాలలో భారతదేశంతో పాటు ఆఫ్ఘనిస్థాన్, అజర్బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బోస్నియా, హెర్జెగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్, తైవాన్, జిబౌటి, దక్షిణాఫ్రికా, చైనా, ఇరాక్, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కంబోడియా, కజాఖ్స్తాన్, కామెరూన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, లావోస్, లిబియా, మయన్మార్, యునైటెడ్ కింగ్డమ్, ఈజిప్ట్, మెక్సికో, మంగోలియా, నేపాల్, నైజర్, నైజీరియా, హాంకాంగ్, జపాన్, బుర్కినా ఫాసో, సూడాన్, సెర్బియా, స్లోవేనియా, ఐవరీ కోస్ట్, మోంటెనెగ్రో ఉన్నాయి.
16 దేశాలపై పాక్షిక నిషేధం..
సౌదీ అరేబియా పాక్షిక నిషేధం విధించిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, ఇటలీ, బెల్జియం, భూటాన్, పోలాండ్, టోగో, డెన్మార్క్, రొమేనియా, జింబాబ్వే, ఫ్రాన్స్, ఫిలిప్పీన్స్, కెనడా, మలేషియా, ఆస్ట్రియా, కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఉన్నాయి. ఈ దేశాలలోని నిర్దిష్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితులు వర్తిస్తాయని తాజా ప్రకటనలో సౌదీ పేర్కొంది. చికెన్ లేదా ఇతర పౌల్ట్రీ ఉత్పత్తులను న్యూకాజిల్ వ్యాధి వైరస్ చనిపోయేలా తగినంత వేడి మీద ఉడికించి ఉండాలి లేదా సరైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేసి ఉండాలి. ఆ ఉత్పత్తిని వైరస్ చనిపోయేలా సరిగ్గా ప్రాసెస్ చేశారని ధృవీకరిస్తూ సంబంధిత దేశ ఆరోగ్య సంస్థ ఇచ్చే అధికారిక సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఆ ఉత్పత్తులు ప్రభుత్వం గుర్తించిన లేదా అనుమతి పొందిన ఫ్యాక్టరీల నుంచే రావాలి.
సౌదీకి భారతీయ కోళ్ల ఎగుమతి ఎంత..
DGCIS డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారతదేశ పౌల్ట్రీ ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువగా దాదాపు $149 మిలియన్లకు చేరుకున్నాయి. దీనికి ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలలో గుడ్లకు బలమైన డిమాండ్ ఉండటం. గత సంవత్సరం ఇదే టైంలో, గుడ్లు, పౌల్ట్రీ ఉత్పత్తుల ఎగుమతులు $71.16 మిలియన్లుగా నమోదు అయ్యాయి. రూపాయి పరంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పౌల్ట్రీ ఎగుమతులు రూ.1,288.63 కోట్లు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఒమన్ వంటి దేశాల నుంచి బలమైన డిమాండ్ భారతదేశ పౌల్ట్రీ ఎగుమతుల పెరుగుదలకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒమన్ కూడా భారతీయ గుడ్లకు ప్రధాన కొనుగోలుదారుగా ఉంది, కానీ ఈ సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, UAE ఒమన్ను అధిగమించి అతిపెద్ద కొనుగోలుదారుగా అవతరించింది. తాజాగా సౌదీ తీసుకున్న నిర్ణయం ఇండియన్ పౌల్ట్రీ ఉత్పత్తులపై ఎంత ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
READ ALSO: The Kerala Story 2: కేరళ స్టోరీ 2 విడుదల లేనట్టే?
