ప్రముఖ తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా ‘డీడీ నెక్స్ట్ లెవెల్’ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా నటుడు సంతానం స్పందించాడు. “మేము ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా సినిమాను తీయలేదు. అలా ఉంటే కచ్చితంగా మాకు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చి ఉండేది కాదు. సెన్సార్లో మాకు అన్ని విధాలుగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. కనుక మేము సినిమాను ఎప్పుడు ఎప్పుడు విడుదల చేద్దామా అని ఎదురు చూస్తున్నాం. సెన్సార్ బోర్డ్ నిబంధనలకు అనుగుణంగానే సినిమాను రూపొందించాం. ఏ ఒక్కరి విషయంలోనూ తప్పుగా వ్యవహరించలేదు. కనుక మేము రోడ్డున పోయేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.” అని సంతానం ఘాటుగా సమాధానమిచ్చాడు.
READ MORE: Off The Record: పెద్దపల్లిలో గులాబీ కేడర్ ను నడిపించే నాయకుడు లేడా..?
సంతానం ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ సినిమా ‘డీడీ నెక్స్ట్ లెవెల్’. ఈ చిత్రానికి ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మే 16న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రంలోని ‘కిస్సా 47’ పాట హిందువుల ఆస్తిక భావాలను, తిరుపతి శ్రీవారిని అవమానించేలా ఉందని ఆరోపిస్తూ.. సేలంకు చెందిన బీజేపీ లీగల్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘కిస్సా 47’ పాటలో వాడిన “గోవింద గోవింద” అనే పదాలు తిరుపతి ఏడుకొండలలో భక్తులు ఆరాధించే పవిత్ర స్వామికి సంబంధించినవని భావిస్తున్నారు. పాటలో ఈ పదాలను వినియోగించడం హిందూ సంప్రదాయాన్ని దూషించే విధంగా ఉందని, ఇది భక్తి గీతాలలో వినిపించే పవిత్రమైన పదాలకు అవమానకరమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు.