ఐపీఎల్ 2026 సీజన్లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ 11 పరుగులు చేయగా.. ఐపీఎల్ కెరీర్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. కేవలం 3555 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా, ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన భారతీయుడిగా సంజూ శాంసన్ అగ్రస్థానంలో నిలిచారు.
ఈ క్రమంలో ఆయన ఐపీఎల్ దిగ్గజాలైన సురేష్ రైనా (3620 బంతులు), కేఎల్ రాహుల్ (3688 బంతులు), ఎంఎస్ ధోనీ (3691 బంతులు) రికార్డులను అధిగమించారు. ఓవరాల్గా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన వారి జాబితాలో ఏబీ డివిలియర్స్ (3288 బంతులు), డేవిడ్ వార్నర్ (3554 బంతులు) తర్వాత సంజూ శాంసన్ మూడో స్థానంలో నిలవడం విశేషం.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఈ మ్యాచ్లో శాంసన్ ఎంతో సంయమనంతో ఇన్నింగ్స్ ప్రారంభించారు. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి ఓవర్లో జాగ్రత్తగా ఆడిన ఆయన, తర్వాతి ఓవర్లో కాగిసో రబాడా బౌలింగ్లో ఫోర్ బాదడం ద్వారా ఈ రికార్డును చేరుకున్నారు. ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న సంజూ, కేవలం మూడు రోజుల క్రితమే ముంబై ఇండియన్స్పై సెంచరీతో చెలరేగారు. రాజస్థాన్ రాయల్స్ తరపున సుదీర్ఘ కాలం ఆడిన సంజూ, ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్లో చేరారు. పసుపు రంగు జెర్సీలోనూ తన విధ్వంసకర బ్యాటింగ్ను కొనసాగిస్తూ, స్ట్రైక్ రేట్ విషయంలో దిగ్గజాలకు దీటుగా నిలుస్తూ ఈ అరుదైన మైలురాయిని అధిగమించారు. సంజూ శాంసన్ సాధించిన ఈ రికార్డు ఆయన నిలకడకు, దూకుడుకు నిదర్శనంగా నిలిచింది.
