NTV Telugu Site icon

Andhra Pradesh: మరో రూ.1,425 కోట్ల పెట్టుబడులు.. ఓ కంపెనీ ప్రారంభం, 3 కంపెనీలకు శంకుస్థాపన

Ys Jagan

Ys Jagan

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు క్రమంగా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి.. ఈ రోజు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ పుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేయడంతో పాటు గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధను ప్రారంభించిన ఏపీ సీఎం..

1. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్‌ తయారీని క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపడుతోంది.. క్రిబ్‌కో నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.610 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో 1000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.. రోజుకు 500 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ తయారీ లక్ష్యంగా ఉంది.. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 4వేల టన్నుల డ్రైడ్‌ డిస్టిలరీ గ్రెయిన్స్‌ ఉత్పత్తి చేయనున్నారు.. ఇక, 2. నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్‌.. ఇథనాల్‌ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది.. ఇథనాల్‌ తయారీ కర్మాగార నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయగా.. రూ.315 కోట్ల పెట్టుబడులతో.. 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు.. రోజుకు 200 కిలోలీటర్ల బయోఇథనాల్‌ తయారీ లక్ష్యంగా ఉండగా.. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి బయో ఇథనాల్‌ తయారీ చేస్తారు. వరిని సాగుచేస్తున్న రైతులకు అత్యంత ఉపయోగకరం ఉండనుంది.. అలాగే మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టలరీ తయారీ
బై ప్రొడక్ట్‌గా డ్రైడ్‌ డిస్టిలరీస్‌ గ్రెయిన్స్‌.

3. తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్‌ కాఫీ లిమిటెడ్‌ పుడ్‌ మరియు బెవెరేజెస్‌ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు.. వర్చువల్‌గా ఈ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం.. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 400 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.. సంవత్సరానికి 16వేల టన్నుల సొల్యుబుల్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ తయారీ ప్లాంట్‌.. ఇక, 4. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు కాబోతోంది.. రూ.100 కోట్ల పెట్టుబడితో 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. రోజూ 400 టన్నుల ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ లక్ష్యంగా ఉంది.. రోజుకు 200 టన్నుల సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ యూనిట్‌ను వర్చువల్‌గా కంపెనీని ప్రారంభించారు సీఎం జగన్‌.

ఇక, ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు వండర్‌పుల్‌ మూమెంట్‌. దాదాపుగా రూ. 1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాను. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నెల్లూరులో క్రిబ్‌కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంట్‌ వస్తుంది. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. 500 కిలోలీటర్ల ప్రొడక్షన్‌ కెపాసిటీతో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ రెండు దశల్లో ప్లాంట్‌ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు వచ్చే గొప్ప మార్పుకు మంచి అవకాశం. కృష్ణపట్నంలో ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చిన క్రిబ్‌కో యాజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. వారికి నా శుభాకాంక్షలు. ఎలాంటి సహకారం కావాలన్న ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి అని సూచించారు సీఎం జగన్‌.

ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి.రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్‌ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్లాంట్‌ డైరెక్టర్‌ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాం. ఏ అవసరం ఉన్నా ఫోన్‌ చేయండి అన్నారు. అదే విధంగా తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్‌ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ ప్లాంట్‌ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నాను. మరోక్కసారి మీకు కూడా చెబుతున్నాను. ఎప్పుడైనా ఏ సమస్య ఉన్న మీకు ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు.

ఏలూరు జిల్లాలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్ధ ఏర్పాటు చేస్తుంది.రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్‌ వల్ల కూడా మరో 500 మందికి ఉద్యోగ ఉఫాధి అవకాశాలు ఏలూరు జిల్లా యువకులకు రావడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి నా అభినందనలు. ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో మీకు అందుబాటులో ఉంటుంది. ఏ అవసరం ఉన్నా ఫోన్‌ చేయండి అన్నారు సీఎం జగన్‌. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు, రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా… గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి. చాలా సంతోషకరమైన సందర్భమిది అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.