Riyan Parag: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ (Riyan Parag) వివాదంలో చిక్కుకున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో ఈ-సిగరెట్ వాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనపై పరాగ్ నుండి వివరణ కోరింది. ఆ వివిరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకోనుంది. భారత చట్టాల ప్రకారం ఈ-సిగరెట్ల వినియోగం నిషేధించబడినందున, ఇది కేవలం క్రీడా నియమాలకే కాదు, చట్టపరమైన అంశంగా కూడా మారింది.
ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధ చట్టం 2019 ప్రకారం.. ఈ-సిగరెట్ల తయారీ, విక్రయం, నిల్వ, వినియోగం, ప్రకటన పూర్తిగా దేశంలో నిషేధించబడ్డాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి మొదటిసారి తప్పు చేసినా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ.1 లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఐపీఎల్ వర్గాల సమాచారం ప్రకారం చాలా మంది ఆటగాళ్లు ఈ-సిగరెట్లు వాడుతున్నా, డ్రెస్సింగ్ రూమ్లో అలా చేయడం చాలా ప్రమాదకరమని, ముఖ్యంగా కెమెరాలు ఉన్న పరిస్థితుల్లో ఇది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లేనని అభిప్రాయపడుతున్నారు. పరాగ్ ఈ విధంగా బహిరంగంగా పట్టుబడటంతో బీసీసీఐ తప్పనిసరిగా చర్యలు తీసుకోనుంది.
ఇక డ్రెస్సింగ్ రూమ్ ప్రైవసీ విషయమై కూడా మరోసారి చర్చ మొదలైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన కెప్టెన్స్ మీట్లో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో కెమెరాల వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లైవ్ ప్రసారంలో కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్పై ఫోకస్ చేయడం వల్ల వ్యక్తిగత గోప్యత భంగం కలుగుతోందని వారు తెలిపారు. అయితే ఈ అంశంపై బీసీసీఐ అధికారులు స్పందిస్తూ.. కెమెరాల వినియోగం బ్రాడ్కాస్టర్ నిర్ణయం మాత్రమేనని, దానిపై తమకు నియంత్రణ లేదని స్పష్టం చేశారు.
