Rishabh Pant Fined: ఐపీఎల్ 2026 సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా మరో కెప్టెన్కు జరిమానా పడింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషభ్ పంత్పై బీసీసీఐ రూ.12 లక్షల ఫైన్ విధించింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఇది ఈ సీజన్లో లక్నో జట్టుకు తొలి స్లో ఓవర్ రేట్ తప్పిదం కావడంతో పంత్కు రూ.12 లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు అధికారిక ప్రకటనలో తెలిపారు.
ఈ సీజన్లో ఇప్పటికే పలువురు కెప్టెన్లు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాలు ఎదుర్కొన్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్, ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్లపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్ చెన్నై సూపర్ కింగ్స్పై ఘన విజయం సాధించింది. ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో సీఎస్కే నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఎల్ఎస్జీ కేవలం 16.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేధించింది. మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 90 పరుగులతో విజృంభించి జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రిషభ్ పంత్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. “గెలుపు ఎప్పుడూ మంచి ఫీలింగ్ ఇస్తుంది. సీజన్ ఎలా ముగిసినా, ప్రతి మ్యాచ్లో విజయం సాధించాలనే భావనతో మేము బరిలోకి దిగుతున్నాం” అని పంత్ తెలిపాడు. అలాగే యువ బౌలర్ ఆకాష్ సింగ్పై కూడా ప్రశంసలు కురిపించాడు. ఆకాశ్ సింగ్ ఐపీఎల్ మొత్తం కష్టపడి ప్రాక్టీస్ చేశాడు. అందరికీ అవకాశాలు ఇవ్వడం సులభం కాదు. కానీ అతడు ఎప్పుడూ ప్లాన్కు కట్టుబడి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో కూడా అదే కనిపించిందని పంత్ అన్నాడు.
ఈ మ్యాచ్లో మూడు వికెట్లు త్వరగా పడినా పంత్ బ్యాటింగ్కు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై స్పందించిన అతడు, “నేను బ్యాటింగ్కు సిద్ధంగానే ఉన్నాను. కానీ తక్కువ అవకాశాలు దక్కిన ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావించింది. అందుకే అబ్దుల్ సమద్, ముకుల్ చౌధరీలను ముందుగా పంపాం” అని వివరించాడు. జట్టులోని ప్రతి ఆటగాడికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు పంత్ స్పష్టం చేశాడు.
