Reliance: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో, భారతీయ కుటుంబాలకు నిరంతరాయంగా గ్యాస్ (LPG) సరఫరా చేయడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నడుం బిగించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తన జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచుతున్నట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, భారతీయ గృహాలకు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
READ ALSO: Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్ను గట్టిగా వాడబోతున్నారా..?
నిరంతరాయ సరఫరాకు చర్యలు..
ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రిఫైనింగ్ హబ్గా ఉన్న జామ్నగర్ ప్లాంట్లో ఎల్పీజీ ఉత్పత్తిని ఆప్టిమైజ్ చేయడానికి రిలయన్స్ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో గ్యాస్ సరఫరా స్థిరంగా, నమ్మదగినదిగా ఉండేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని సంస్థ పేర్కొంది. దీంతో పాటు, కేజీ-డి6 (KG-D6) బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే సహజ వాయువును కూడా జాతీయ ప్రాధాన్యత రంగాలకు మళ్లించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాలు, దేశ ఇంధన అవసరాలకు అనుగుణంగా ఈ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది.
దేశం కోసమే రిలయన్స్..
“రిలయన్స్కు ఎప్పుడూ భారతదేశ ఇంధన భద్రత, కోట్లాది మంది భారతీయుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత” అని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ.. అత్యంత అవసరమైన రంగాలకు, సామాన్య ప్రజలకు ఇంధనం అందేలా చూస్తామని రిలయన్స్ హామీ ఇచ్చింది. దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు రిలయన్స్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
