IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ..

Ipl 2026 Champions

Ipl 2026 Champions

IPL 2026 Champions: ఐపీఎల్ 2026 టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు (RCB) ప్రత్యర్థి జట్లు అభినందనలు తెలియజేశాయి. అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ (GT)ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చలు, ట్రోల్స్, మీమ్స్ హోరెత్తగా.. ప్రముఖ ఫ్రాంచైజీలు మాత్రం క్రీడాస్ఫూర్తిని చాటుతూ ఆర్సీబీకి అభినందనలు తెలిపాయి.

ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) సహా పలు ఫ్రాంచైజీలు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాయి. ముఖ్యంగా సీఎస్‌కే, ముంబై సందేశాలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటే ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఐదేసి టైటిళ్లు గెలిచి అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా నిలిచాయి. అంతేకాకుండా ఆర్సీబీతో వీరి మధ్య ఉన్న పోటీ కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి.

×
×
Ad

జూన్ 1 ఉదయం ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ ఆటగాళ్లు ట్రోఫీతో సంబరాలు చేసుకుంటున్న ఫొటోను షేర్ చేసింది. “టాటా ఐపీఎల్ 2026 గెలిచిన ఆర్సీబీకి అభినందనలు” అంటూ సందేశం పోస్ట్ చేసింది. అలాగే మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే సీఎస్‌కే కూడా ప్రత్యేక సందేశంతో ఆర్సీబీని అభినందించింది. “వరుసగా రెండు టైటిళ్లు గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. అభినందనలు ఆర్సీబీ… ఈ ప్రత్యేక క్లబ్‌లోకి స్వాగతం” అంటూ పోస్టు చేసింది. టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన జట్ల జాబితాలోకి ఆర్సీబీ చేరినందుకు సీఎస్‌కే ఈ విధంగా స్వాగతం పలికింది.

సీఎస్‌కే సందేశానికి ఆర్సీబీ కూడా స్పందించింది. “ధన్యవాదాలు పొరుగువారూ… వచ్చే ఏడాది మీతో జరిగే మ్యాచ్‌ల కోసం ఎదురుచూస్తున్నాం” అంటూ సమాధానం ఇచ్చింది. ఈ స్నేహపూర్వక సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. మైదానంలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, జట్ల మధ్య పరస్పర గౌరవం కొనసాగుతుందనే విషయాన్ని ఈ పోస్టులు మరోసారి నిరూపించాయి. మొత్తంగా ఆర్సీబీ విజయం తర్వాత సోషల్ మీడియా వేదికలు మీమ్స్, ట్రోల్స్, సరదా కామెంట్లతో నిండిపోయాయి.

ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చాటింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్‌ను 155/8 స్కోరుకే పరిమితం చేసింది. వాషింగ్టన్ సుందర్ అజేయ అర్ధశతకం సాధించినప్పటికీ, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలాం అద్భుత బౌలింగ్‌తో గుజరాత్‌ను కట్టడి చేశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి వెంకటేశ్ అయ్యర్ మంచి ఆరంభం అందించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ తన క్లాస్‌ను చూపిస్తూ 42 బంతుల్లో అజేయ 75 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. టిమ్ డేవిడ్, జితేష్ శర్మ కూడా కీలక పాత్ర పోషించడంతో ఆర్సీబీ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.