Site icon NTV Telugu

RBI New UPI Rule: ఆర్బీఐ కొత్త ప్లాన్‌.. UPI చెల్లింపుల్లో కీలక మార్పులు..!

Rbi New Upi Rule

Rbi New Upi Rule

RBI New UPI Rule: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన UPI వ్యవస్థలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సైబర్ మోసాలను అరికట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. పెద్ద మొత్తంలో జరిగే UPI లావాదేవీలకు ఒక గంట ఆలస్యాన్ని అమలు చేయాలని ఆలోచిస్తోంది. UPI ద్వారా తక్షణ చెల్లింపులు చేసే సౌకర్యం వల్ల దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగం పెరిగింది. అయితే, ఇదే వేగాన్ని సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని నిమిషాల్లోనే డబ్బును అనేక ఖాతాల ద్వారా తరలించడం, వెంటనే ఉపసంహరించుకోవడం జరుగుతోంది. దీంతో మోసపోయిన డబ్బును తిరిగి పొందడం చాలా కష్టమవుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ ఈ కొత్త విధానాన్ని ప్రతిపాదించింది.

ఏ చెల్లింపులకు వర్తిస్తుంది?
ఈ ప్రతిపాదన ప్రకారం రూ.10,000 దాటిన వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) జరిగే UPI చెల్లింపులకు ఒక గంట ఆలస్యం ఉండే అవకాశం ఉంది. అంటే, డబ్బు పంపిన వెంటనే పంపేవారి ఖాతా నుంచి డెబిట్ అవుతుంది, కానీ స్వీకరించే వ్యక్తి ఖాతాలోకి అది ఒక గంట తర్వాత మాత్రమే చేరుతుంది. అయితే దుకాణాల్లో QR కోడ్ స్కాన్ చేసి చేసే చెల్లింపులు, ఆటో-డెబిట్, సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులపై ఈ మార్పు ప్రభావం ఉండదు.

‘గోల్డెన్ అవర్’ కాన్సెప్ట్
ఆర్బీఐ ప్రతిపాదనలో ఈ ఒక గంట వ్యవధిని “గోల్డెన్ అవర్”గా పేర్కొంటున్నారు. ఈ సమయంలో వినియోగదారులు తమ లావాదేవీని సమీక్షించుకోవచ్చు. ఏదైనా అనుమానం ఉంటే ఒక గంటలోపు ట్రాన్సాక్షన్‌ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మార్పుతో వినియోగదారులకు అదనపు భద్రత లభిస్తుంది. తెలియని వ్యక్తులకు డబ్బు పంపేటప్పుడు తప్పిదాలు తగ్గుతాయి. అలాగే మోసపోయే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

అమలు ఎప్పుడు?
ప్రస్తుతం ఇది ఆర్బీఐ విడుదల చేసిన చర్చా పత్రం మాత్రమే. దీనిపై అభిప్రాయాలు సేకరించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా, వేగంతో పాటు భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ UPI వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చేందుకు ఆర్బీఐ ఈ కీలక మార్పును ప్రతిపాదించిందని చెప్పవచ్చు.

Exit mobile version