ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా, రేషన్ కార్డు వినియోగదారులందరికీ ‘ఈ-కేవైసీ’ (e-KYC) ప్రక్రియను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గతంలో రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, అనర్హులను తొలగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది లబ్ధిదారులు తమ కార్డులలో వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే లక్షలాది కార్డులు నిబంధనలు పాటించని కారణంగా రద్దు చేశారు. కాబట్టి, ప్రభుత్వం అందించే ఉచిత లేదా రాయితీ బియ్యం, ఇతర సరుకులను నిరంతరాయంగా పొందాలంటే.. ప్రతి కార్డుదారుడు తమ ఆధార్ వివరాలను రేషన్ కార్డుతో అనుసంధానించి.. వేలిముద్రల ద్వారా ధృవీకరణ పూర్తి చేసుకోవడం అత్యవసరం.
రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తి బ్రతికే ఉన్నారా లేదా? ఒకే వ్యక్తికి రెండు చోట్ల కార్డులు ఉన్నాయా? అనే విషయాలను నిర్ధారించుకోవడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది పారదర్శకతను పెంచుతుంది. కార్డుదారులు తమ సమీపంలోని రేషన్ దుకాణానికి (FPS) వెళ్లి, అక్కడి డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ (e-PoS) యంత్రం ద్వారా తమ వేలిముద్రలను వేయాలి. దీనినే బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటారు.
ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారి పేర్లను కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మొత్తం కార్డునే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ-కేవైసీ అప్డేట్ చేయని కారణంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులను అధికారులు గుర్తించి తొలగించారు.
మీరు ప్రస్తుతం మీ ఊరిలో లేకపోయినా, ‘వన్ నేషన్ – వన్ రేషన్ కార్డ్’ పథకం ద్వారా మీరు ఉన్న చోటే దగ్గరలోని రేషన్ షాపులో కేవైసీ పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటికీ చాలా మంది రేషన్ కార్డుదారులు తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదని.. వారు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం కోరుతోంది. దీంతో పాటు.. వరుసగా మూడు నెలల కంటే ఎక్కువ నెలలు ఆ రేషన్ కార్డు ద్వారా ఎలాంటి రేషన్ తీసుకోకపోతే.. ఆ కార్డులు కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా రద్దైన కార్డులు కూడా దేశ వ్యాప్తంగా చాలా ఉన్నాయి.
