దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా ఇక లేరనే వార్త విని వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు కన్నీరు పెట్టుకుంటున్నారు. బాలీవుడ్తో అనుబంధం ఉన్న నేపథ్యంలో రతన్ టాటా నిర్మించిన సినిమాను కొందరు గుర్తుచేసుకుంటున్నారు.
పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. ఓ సమయంలో సినీ రంగాన్ని కూడా పలకరించారు. 2004లో ఏత్బార్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంకు విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. దిగ్గజం రతన్ టాటా నిర్మించిన ఏకైక సినిమా ఇదే. హాలీవుడ్ చిత్రం ఫియర్ ఆధారంగా ఏత్బార్ తెరకెక్కింది.