కోలీవుడ్లో ఎప్పుడూ లేనంత భారీ క్రేజీ మల్టీస్టారర్ సెట్ కాబోతోందా? అంటే అవుననే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్’ పై ఈ సినిమాను నిర్మిస్తుండటం ఒక విశేషమైతే, ఈ మూవీలో విలన్ ఎవరనే వార్త ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తోంది.
రజనీకాంత్ కెరీర్లో ‘శివాజీ’, ‘రోబో’, ‘2.0’ వంటి అద్భుతమైన చిత్రాలు సృష్టించిన డైరెక్టర్ శంకర్, ఇప్పుడు రజనీకి విలన్గా మారబోతున్నారట. శిబి చక్రవర్తి డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ విలన్ పాత్ర కోసం శంకర్ను సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా మెగా ప్రాజెక్టులు తీసే శంకర్, నటుడిగా రజనీ లాంటి దిగ్గజం ముందు నిలబడితే ఆ సన్నివేశాలు వెండితెరపై మైండ్ బ్లోయింగ్గా ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా
కేవలం నిర్మాతగానే కాకుండా, ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక కీలకమైన క్యామియో పాత్రలో మెరవబోతున్నట్లు సమాచారం. ‘విక్రమ్’ సినిమా తర్వాత కమల్ మార్కెట్ అమాంతం పెరిగింది, ఇప్పుడు రజనీ సినిమాలో ఆయన కనిపిస్తే అది ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్క్రీన్ షేరింగ్ అవుతుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ క్రేజీ ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఈ వార్తపై అధికారిక ప్రకటన వస్తే మాత్రం సౌత్ ఇండియాలోనే కాకుండా గ్లోబల్ లెవల్లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం.
