Site icon NTV Telugu

Rajasthan: ‘మా అమ్మ నిద్రపోతోంది, డిస్టర్బ్‌ చేయొద్దు’.. తల్లి మృతదేహం వద్ద రెండేళ్ల చిన్నారి

Rajasthan

Rajasthan

Rajasthan: కన్నతల్లి చనిపోయిందని తెలియని ఓ రెండేళ్ల చిన్నారి.. తల్లి మృతదేహం వద్దే గంటల తరబడి వేచిచూస్తూ ఉంది. ఆమె పక్కనే సుమారు ఆరు గంటలసేపు ఉంది. ‘అమ్మా ఆకలేస్తోంది.. లే’ అని పిలుస్తూ తల్లి మృతదేహం పక్కనే కూర్చుంది. ఆ బాలికతో పాటు మూడు నెలల వయస్సు సోదరుడు కూడా అదే మంచం మీద ఆడాడు. తల్లి చనిపోయిందని ఆ ఇద్దరికీ తెలియదు. ఆ చిన్నారి ‘అమ్మా లేమ్మా’ అంటూ తన తల్లిని పిలిచిన ఈ హృదాయవిదారక ఘటన రాజస్థాన్‌లోని టోంక్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఆ బాలిక తన తల్లి మృతదేహంపై ఉన్న బెడ్‌షీట్‌ను లాగుతూనే ఉంది. ఈ ఘటన అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది.

రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలోని నైన్వా పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని రోగుల వార్డులోనే మృతదేహాన్నిఆరు గంటల పాటు ఉంచారు. ఆ చిన్నారులు కూడా తల్లి మృతదేహం వద్దే విలపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల చిన్నారి విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీసుల కోసం వారు వేచి ఉండగా.. చిన్నారులు తమ తల్లి కోసం వేచి చూస్తున్నట్లు కనిపించింది. ఆ రెండేళ్ల బాలిక అక్కడున్న వారితో తమ తల్లిని డిస్టర్బ్‌ చేయొద్దని.. ఆమె నిద్రపోతోందని చెప్పింది. కానీ ఆ చిన్నారి పదే పదే తన తల్లిని మేల్కొలిపేందుకు ప్రయత్నించింది. “మా, మా (తల్లి)” అని పిలుస్తూ ఏడ్చింది. ఆ చిన్నారి ఏడుపు చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.

PM Narendra Modi: ప్రధాని దీపావళి గిఫ్ట్‌.. 75 వేల మందికి ఉద్యోగాలు

పోలీసులు వచ్చిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. షబానా అనే మహిళ ఎలా మరణించిందనేది కచ్చితంగా తెలియరాలేదు. ఆమె కుటుంబ సభ్యులు శవపరీక్ష చేయడానికి నిరాకరించారు. ఆమె పొత్తికడుపులో దీర్ఘకాలిక సమస్య ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెకు రక్తహీనత తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు. టోంక్‌ జిల్లాలోని నాగర్‌ఫోర్ట్ పట్టణంలో షబానా తన పుట్టింట్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హర్యానాలోని రేవారీలో తన అత్తమామలు, భర్త ఉంటారు.

గత శనివారం కడుపులో నొప్పి తీవ్రంగా మారడంతో షబానా చికిత్స కోసం కోటకు వెళ్లినట్లు ఆమె సోదరుడు సలీం తెలిపారు. కోటకు వెళ్లే బస్సులో ఉండగానే ఆమె ఆరోగ్యం క్షీణించగా.. ఆమెను నైనాలోని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని అదే బెడ్‌పై షీట్‌తో కప్పారు. నాగర్‌ఫోర్ట్ నుండి పోలీసులు సాయంత్రం 6.30 గంటలకు చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Exit mobile version