Rajasthan Royals Injuries: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్కు చేరుకున్న ఆనందం ఎక్కువసేపు లేనట్లుగా కనపడుతుంది. దీనికి కారణం జట్టులోని స్టార్ ఆటగాళ్ల ఫిట్నెస్ ఇప్పుడు పెద్ద ఆందోళనగా మారింది. ముఖ్యంగా భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు జట్టు మేనేజ్మెంట్ వెల్లడించింది. మరోవైపు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా పూర్తిస్థాయి ఫిట్నెస్లో లేనట్లు చెప్పడం అభిమానుల్లో ఆందోళన పెంచుతోంది.
ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక మ్యాచ్లో రాజస్థాన్ విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ చివర్లో కేవలం 11 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరును అందించాడు. అయితే అతడు ఇటీవల మోకాలి గాయం, మోచేతి సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ కారణంగానే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్పై జరిగిన వరుస మ్యాచ్ లకు జడేజా దూరమయ్యాడు. ముంబైతో జరిగిన మ్యాచ్లో కూడా జడేజాను పూర్తి స్థాయిలో వినియోగించకుండా ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దింపారు.
అయితే మ్యాచ్ అనంతరం రాజస్థాన్ హెడ్ కోచ్ కుమార సంగక్కర మాట్లాడుతూ జడేజా ఫిట్నెస్పై స్పష్టత ఇచ్చాడు. జడేజా గాయంతో బాధపడుతున్నాడు. అతడిని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాం. ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం వల్ల అతడిపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంకో రెండు రోజుల విశ్రాంతి లభిస్తే మరింత మెరుగ్గా వినియోగించగలం అని సంగక్కర పేర్కొన్నాడు.
మరోవైపు జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా తాను పూర్తిగా ఫిట్గా లేనని వెల్లడించాడు. “నేను పూర్తిస్థాయి ఫిట్నెస్లో లేను. మానసిక ధైర్యంతోనే ఆడుతున్నాను. నిజానికి ఈ మ్యాచ్లో కూడా ఆడకూడదని అనుకున్నాం. అయినా జట్టు కోసం బరిలోకి దిగాను” అని మ్యాచ్ అనంతరం తెలిపాడు. ప్లేఆఫ్స్లో ఆడతారా అనే ప్రశ్నకు “ఖచ్చితంగా ఆడతాను” అని పరాగ్ సమాధానం ఇచ్చాడు. జడేజా గురించి కూడా మాట్లాడుతూ.. “జడ్డూ భాయ్కు చిన్నచిన్న గాయాలు ఉన్నాయి. కానీ అతడు యోధుడు.. తిరిగి బలంగా వస్తాడు” అని అన్నాడు.
ఇదిలా ఉండగా రాజస్థాన్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా గతంలో జడేజా మోకాలికి స్వల్ప గాయం ఉందని వెల్లడించాడు. అతడి మోకాలిలో కొంత సమస్య ఉంది. అందుకే ఒక మ్యాచ్ అదనంగా విశ్రాంతి ఇవ్వాలని భావించాం అని మే 17న ఢిల్లీపై మ్యాచ్ అనంతరం రాథోడ్ తెలిపాడు. దీనితో ప్లేఆఫ్స్ ముందు జడేజా, రియాన్ పరాగ్ ఫిట్నెస్ రాజస్థాన్ రాయల్స్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇద్దరూ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తే జట్టుకు బలం చేకూరే అవకాశం ఉంది. ఇక ప్లేఆఫ్స్ లో రాజస్థాన్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో మే 27 న న్యూచండీగఢ్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడనుంది.
