Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు.. చార్‌ధామ్‌ యాత్రకు ఇక్కట్లు

Raeee

Raeee

ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇదిలా ఉంటే శుక్రవారం చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కానుంది. ఇంతలో భారీ వర్షాలు స్థానికులను, భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చార్‌ధామ్‌ యాత్ర మే 10 నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్ర చేసేందుకు లక్షలాది మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొందరు భక్తులు ఇప్పటికే ఉత్తరాఖండ్‌ చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలకు తోడు వడగళ్ల వానలు కురుస్తున్నాయి. అల్మోరా-సోమేశ్వర్ ప్రాంతంలో పిడుగులు పడుతున్నాయి. అల్మోరా-కౌసాని హైవేపై కొండచరియలు విరిగిపడటంతో గత 12 గంటలుగా ఈ రహదారిని మూసివేశారు. మారుతున్న వాతావరణం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు కారణంగా భక్తులకు ఇక్కట్లు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Service App Hacked : 108, 102 అంబులెన్స్ సర్వీస్ యాప్ హ్యాక్.. రూ.500ఇచ్చి హాజరు వేయించుకుంటున్న ఉద్యోగులు

ఉత్తరాఖండ్‌లోని అల్మోరాతో పాటు, బాగేశ్వర్‌లో ఆకాశం మేఘావృతమైంది. ఉత్తరకాశీలోని పురోలాలో భారీ వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల వరద ముప్పు ఏర్పడింది. మే 13 వరకు ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఇటువంటి వర్షాల సమయంలో ట్రెక్కింగ్‌ చేయవద్దని టూరిస్టులకు వాతావరణశాఖ తెలిపింది.

భారీ వర్షం కారణంగా ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోడ్లు మూసుకుపోయాయి. అలాగే ఇళ్లలోకి నీరు ప్రవేశించాయి. వర్షం కారణంగా కొన్ని ప్రదేశాల్లో అడవులలో చెలరేగిన మంటలు ఆరిపోతున్నాయి. మరోవైపు వడగండ్ల వానతో పంట నష్టపోయింది. పలువురి రైతులు లబోదిబో అంటున్నారు. తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఇక ఉత్తరకాశీ జిల్లాలోని పురోల హుడోలి లోయ సమీపంలోని మార్కెట్‌లో కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్‌లో అడవుల్లో మంటలు చెలరేగడంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Owaisi Counters: గంట టైం ఇస్తాం ముస్లీంలను ఏం చేస్తారో చేయండి.. నవనీత్ కౌర్ కు ఒవైసీ కౌంటర్