Ragi Milk: అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. అలాంటి సమయంలో శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంతో పాటు అవసరమైన పోషకాలను అందించే సహజ పానీయాలు తీసుకోవడం ఎంతో అవసరం. అలాంటి ఆరోగ్యకరమైన డ్రింక్స్లో రాగి మిల్క్ లేదా రాగి జ్యూస్ ఒకటి. రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో ఇది ఎముకల బలానికి, జీర్ణక్రియకు, శక్తి పెంపుదలకు సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించే సహజ పానీయంగా ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది. మరి వీటిని ఎలా చూసేయాలో చూసేద్దామా..
రాగి గింజలతో తయారుచేసే రాగి మిల్క్:
కావాల్సిన పదార్థాలు:
* 1 కప్పు రాగి గింజలు
* 10 బాదంపప్పులు
* 2 టేబుల్ స్పూన్లు తురిమిన కొబ్బరి
* 3 టేబుల్ స్పూన్లు బెల్లం
* అర టీస్పూన్ యాలకుల పొడి
* 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజలు
* అవసరమైనంత నీరు
తయారీ విధానం:
ముందుగా రాగి గింజలను శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత వాటిని తక్కువ మంటపై చిన్నగా వేయించి చల్లార్చాలి. ఇప్పుడు మిక్సీ జార్లో రాగి గింజలు, బాదం, కొబ్బరి, బెల్లం, ఏలకుల పొడి వేసి తగినంత నీరు జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో లేదా ఫైన్ స్ట్రైనర్తో వడకట్టి పాలు వేరుచేయాలి. చివరగా ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు, ఐస్ క్యూబ్స్ కలిపి చల్లగా సర్వ్ చేస్తే రుచికరమైన రాగి మిల్క్ సిద్ధమవుతుంది.
రాగి పిండితో రాగి జ్యూస్:
కావాల్సిన పదార్థాలు:
* 2 టేబుల్ స్పూన్లు రాగి పిండి
* 1 కప్పు నీరు
* 2 టేబుల్ స్పూన్లు బెల్లం
* 3 ఎండు అంజీర్ పండ్లు
* 10 బాదంపప్పులు
* అవసరమైనంత నీరు
తయారీ విధానం:
ఒక పాత్రలో రాగి పిండి, ఒక కప్పు నీరు వేసి బాగా కలపాలి. తర్వాత తక్కువ మంటపై ఉడికిస్తూ చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బెల్లం, అంజీర్, బాదంపప్పులు జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే మరికొంత నీరు కలిపి, ఐస్ క్యూబ్స్ జోడించి సర్వ్ చేస్తే పోషకాలతో నిండిన రాగి జ్యూస్ రెడీ.
రాగి మిల్క్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
* శరీరానికి సహజ చల్లదనాన్ని అందిస్తుంది.
* కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి.
* ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
* ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
* వేసవిలో శక్తిని నిలబెట్టడంలో సహాయపడుతుంది.

