AP BJP President: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్.. పార్టీ బాధ్యతలను అప్పగించిన పురంధేశ్వరి!

  • ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్
  • మాధవ్‌కు ధృవీకరణ పత్రంను అందజేసిన ఎంపీ పాకా
  • పార్టీ బాధ్యతలను అప్పగించిన పురంధేశ్వరి
Pvn Madhav

Pvn Madhav

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఎన్నికయ్యారు. మాధవ్‌ను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికల అబ్జర్వర్, కర్నాటక ఎంపీ పీసీ మోహన్ ప్రకటించారు. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా మాధవ్‌కు ధృవీకరణ పత్రంను ఎంపీ పాకా సత్యనారాయణ, పీసీ మోహన్ అందజేశారు. బీజేపీ జెండాను మాధవ్‌కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నూతన అధ్యక్షుడు మాధవ్‌కు పార్టీ నేతలు అందరూ శుభాకాంక్షలు తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నామినేషన్ల గడవు ముగిసింది. పీవీఎన్‌ మాధవ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. ఒకే నామినేషన్ వేయడంతో.. ఏపీ బీజేపీ చీఫ్‌ పేరు నిన్ననే ఖరారు అయింది. ఈరోజు అధికారికంగా ప్రకటించారు. పీవీఎన్ మాధవ్‌కు బీజేపీ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్.. గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేవైఎంలో ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

Also Read: Srisailam Temple: శ్రీశైలం భక్తులకు శుభవార్త.. నేటి నుంచి ఉచిత స్పర్శ దర్శనం!

పీవీఎన్‌ మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్‌. 1973 ఆగస్టు 10న విశాఖపట్నంలోని మద్దిలపాలెంలో జన్మించారు. బీజేపీ సీనియర్‌ నేత, దివంగత చలపతిరావు కుమారుడే మాధవ్‌. చలపతిరావు రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. నిన్నటివరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్న విషయం తెలిసిందే.