Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య

  • సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
  • దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు
  • పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు ఏర్పాటు
Pune3

Pune3

మహారాష్ట్రలో పూణె ట్రెక్కర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హనీమూన్ మర్డర్ కేసు ఇంకా మరువక ముందే.. పూణెలో అదే తరహాలో మరో ఉదంతం వెలుగు చూడడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఆమె పెళ్లి చేసుకుని భర్తను చంపేస్తే.. ఇక్కడ పెళ్లికాకముందే పైకి పంపేయడంతో నిర్ఘాంతపోతున్నారు.

26 ఏళ్ల కేతన్ విశాల్ అగర్వాల్ పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందినవాడు. కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కేతన్ అగర్వాల్-సియా గోయల్‌కు నిశ్చితార్థం జరిగింది. అయితే జూన్ 18న సియా పుట్టిన రోజు ఉండడంతో చారిత్రాత్మక ప్రాంతమైన లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అయితే కేతన్ అగర్వాల్-సియా గోయల్‌తో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కూడా వెళ్లాడు. అయితే కేతన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో చేతన్ చౌదరితో కలిసి మర్డర్ స్కెచ్ గీసింది. అయితే కాబోయే భార్య కుట్రను గమనించని కేతన్ అగర్వాల్ అనుమానించలేకపోయాడు. లోయ సమీపంలో ఫొటో దిగుతున్న సమయంలో హఠాత్తుగా కేతన్‌ను సియా లోయలోకి తోసేసింది. అనంతరం పోలీసులకు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయినట్లుగా కట్టుకథ అల్లింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

×
×
Ad

ఇలా దర్యాప్తులో భాగంగా ఫోన్ కాల్ రికార్డ్స్‌ను, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్లను పోలీసులు పరిశీలించారు. దీంతో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా సియా గోయల్ కూడా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేయడంతో తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్ అగర్వాల్‌ను చంపేసినట్లుగా అంగీకరించింది. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రియుడితో కలిసి పథకం

పోలీసుల ప్రకారం.. సియా గోయల్ తన సహోద్యోగి చేతన్ చౌదరితో ప్రేమలో ఉంది. కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో అతడిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన ప్రియుడు చేతన్ సహాయంతో లోహగడ్ కోట దగ్గరకు కేతన్‌ను తీసుకెళ్లి లోతైన లోయలోకి తోసివేసినట్లు కనిపెట్టారు. ఈ విషయాన్ని ధృవీకరించిన పోలీసు అధికారి సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. “దర్యాప్తులో చేతన్ కూడా సంఘటన స్థలంలో ఉన్నట్లు తేలింది. కేతన్ అగర్వాల్‌ను హత్య చేసేందుకు ఇద్దరూ కలిసి కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు” అని తెలిపారు.

రూ.17 కోట్ల పెళ్లి ఏర్పాట్లు

ఈ కేసులో మరో విషాదకర అంశం ఏమిటంటే.. కేతన్, సియా వివాహం ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సి ఉంది. ఇందుకోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక విలాసవంతమైన రాజభవనాన్ని సుమారు రూ.17 కోట్ల వ్యయంతో బుక్ చేసినట్లు సమాచారం. అతిథుల కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా ఏర్పాటు చేసినట్లు కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న సమయంలో ఈ దారుణ ఘటన జరగడం రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ‘‘అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు’’ అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యలో మరెవరైనా సహకరించారా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ప్రేమ, నమ్మకం, వివాహ బంధం పేరుతో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.