Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..

Ponnam

Ponnam

హైదరాబాద్‌ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు మూడు మున్సిపల్ కమిషనర్లు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను నగరంలో శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం.

సామూహిక ఉత్సవాలు ఘనంగా జరగడానికి వీలుగా గణేష్ మండపాల నిర్వహణ, శానిటేషన్, తగిన భద్రత, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటుపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భక్తులు మట్టి వినాయక విగ్రహాలనే ఉపయోగించాలని కోరారు. అలాగే ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు మొక్కలు పంపిణీ చేయాలని మరియు చేనేత కండువాలు వాడాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో బోనాల ఉత్సవాల సమయంలో మంచి వర్షాలు పడాలని ఆలయాల్లో పూజలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ గణేష్ ఉత్సవాల్లో కూడా ఎల్ నినో ప్రభావం తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రభుత్వాభిప్రాయంగా ఉత్సవ సమితికి సూచించారు. న్యాయస్థానాల ఉత్తర్వులను పూర్తిగా గౌరవిస్తూనే ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి అనవసర నియంత్రణలు లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.