Jagtial: జగిత్యాల జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో వెలిసిన వాల్ పోస్టర్లు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణిలకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రత్యక్షమవడంతో స్థానిక రాజకీయాలు మరింత వేడెక్కాయి. జగిత్యాల మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ భోగ శ్రావణిని లక్ష్యంగా చేసుకుని పోస్టర్లు వెలిశాయి. మరోవైపు, నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హయాంలో జరిగిన అవినీతిపై చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పోస్టర్లు కనిపించాయి. శుక్రవారం ఉదయం జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద బహిరంగ చర్చకు రావాలంటూ కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పరం సవాళ్లు విసురుతున్నారు. ఈ వాల్ పోస్టర్ల వ్యవహారం జగిత్యాల రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుండగా, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక మరోవైపు.. జగిత్యాలకు కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. ఈ కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించే వ్యవహారంలో బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కారుతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. కేంద్రీయ విద్యాలయ స్థల సమస్య ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ ఎంపీ అర్వింద్ అన్న చందంగా మారింది. స్థల కేటాయింపులో స్వార్థ రాజకీయాలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్పడుతున్నాడంటూ ఎంపీ అర్వింద్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం భూ సేకరణకు అధికారులు సర్వే నిర్వహించారు. ఈ అంశంలో చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
