ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా 102 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించబోతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు (బేగంపేట, వరంగల్, కరీంనగర్) ఉంటే అందులో మన కరీంనగర్ ఉండటం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ అద్బుతంగా మారిందని.. త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను కూడా ఆధునికీకరించబోతున్నామన్నారు. తీగలగుట్ట ఆర్వోబీ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. బడ్జెట్ కంటే అదనంగా మరో రూ.2కోట్లు వెచ్చించి రోడ్లు, ఇతర సౌకర్యలు కల్పిస్తున్నాట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఉప్పల్ ఆర్వోబీ పనుల జాప్యంపై కాంట్రాక్టర్, అధికారులను మందలించామని పేర్కొన్నారు.
READ MORE: CID: ఫాల్కన్ స్కాం కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరు అరెస్ట్..
“జూన్ నాటికి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా వన్ లైన్ పనులను పూర్తి చేయాలని ఆదేశించాం. 10 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్ల దుస్థితి ఎలా ఉండేదో అందరూ చూశారు. ‘‘అమృత్ భారత్’’ పథకం కింద దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో దేశవ్యాప్తంగా 1350 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణలో 2 వేల కోట్లతో 40 రైల్వే రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపోయాయి. ‘‘అమృత్ భారత్’’ కింద కరీంనగర్ రైల్వే స్టేషన్ కు 33 కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. 2023 ఆగస్టులో అభివృద్ధి పనులు స్టార్ట్ చేసి 21 నెలల్లోనే పూర్తి చేసిన అధికారులకు అభినందనలు. ఈ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా 2 ఎంఎంటీఎస్ ప్లాట్ఫాంలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్ ఏసీ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్ల ఏర్పాటు భేష్ . తెలంగాణలో రైల్వే అభివ్రుద్ధికి 32 వేల 940 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేశాం. ఈ ఒక్క ఏడాదే 5 వేల 336 వేల కోట్లు కేటాయింపు. నాచారం రైల్వే టెర్మినల్ ను అద్బుతంగా నిర్మించుకున్నాం. 750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు కొనసాగుతున్నాయి. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునికీకరిస్తున్నాం. కేంద్రం ఏం చేసిందని ప్రశ్నించే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు అభివృద్ధి పనులే నిదర్శనం.” అని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.