Kuwait Fire: కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయ కార్మికుల కుటుంబాలకు భారత ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల సాయం ప్రకటించింది. ఈ సహాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధి నుంచి అందజేస్తారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7 లోక్కల్యాణ్ మార్గ్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఈ దురదృష్టకర సంఘటనపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.
Read Also: Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కల్కి
ఇక, కువైట్ లోని భారతీయులకు అన్ని విధాలా సహాయాన్ని అందించాలని ప్రధాని మోడీ ఆదేశించారు. సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పాటు మృతదేహాలను త్వరగా భారత్ కు తిరిగి తీసుకురావడానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రిని వెంటనే కువైట్కు వెళ్లాల్సిందిగా చెప్పారు. కాగా, దక్షిణ కువైట్లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న బహుళ అంతస్తుల భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 50 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 42 మంది భారతీయులే ఉన్నారు.
Read Also: Rohit Sharma Record: సౌరవ్ గంగూలీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ!
ఈ ప్రమాదం రాత్రి నిద్రపోతున్న సమయంలో పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఈ భవనంలో ఒకే కంపెనీకి చెందిన 195 మంది కార్మికులు నివసిస్తున్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 50కి చేరుకుందని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో నివేదించింది. ఇక, మృతుల్లో 11 మంది కేరళకు చెందిన వారని, మిగిలిన వారు తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తుంది.