Petrol, Diesel Price Hike: ఎలక్షన్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ.. పాత రికార్డులు గుర్తు చేస్తూ..

Petrol

Petrol

Petrol, Diesel Price Hike: గతం రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని, లీటరుకు రూ. 25 నుంచి రూ. 28 వరకు పెరగనున్నాయనే ప్రచారం మొదలైంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న విభిన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెగుతాయన్న వార్తలపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇక, ఈ ప్రచారానికి ప్రధాన కారణం ‘కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్’ ఇచ్చిన ఒక నివేదిక. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 120 డాలర్ల సమీపంలో ఉండటంతో ఎన్నికల తర్వాత భారత్‌లో ఇంధన ధరలు భారీగా పెరుగుతాయని ఆ నివేదిక అంచనా వేసింది. అయితే, ఈ వార్తలను కొట్టిపారేసిన ప్రభుత్వం.. ఇవన్నీ ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి చేసే తప్పుడు ప్రచారాలని ‘ఎక్స్’ వేదికగా పేర్కొంది. గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని ఏకైక దేశం భారత్ మాత్రమేనని గుర్తుచేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఇంధన రవాణాకు కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) వద్ద సైనిక జోక్యం వల్ల సరఫరాకు ఆటంకం కలిగింది. అయినప్పటికీ, దేశీయ వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం గతంలోనే పెట్రోల్‌పై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయాన్ని మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలన్నీ (Refineries) పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని, దేశవ్యాప్తంగా సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. దీనితో పాటు, కీలక రంగాలకు అవసరమైన C3, C4 స్ట్రీమ్‌లను అందుబాటులో ఉంచేలా ఆయిల్ రిఫైనరీలకు అనుమతులు ఇచ్చామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.