Paris Restaurant apologises to Serena Williams: అమెరికా నల్ల కలువ, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్కు పారిస్ నగరంలో అవమానం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ 2024కు కుటుంబంతో హాజరైన సెరెనాను ఓ రెస్టరెంట్ లోపలికి అనుమతించలేదు. ఈ విషయాన్ని సెరెనా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘ఖాళీగా ఉన్న పెనిన్సులా రూఫ్టాప్ రెస్టరెంట్లో తినేందుకు కుటుంబంతో కలిసి వెళ్లాను. అక్కడ నన్ను లోపలికి అనుమతించలేదు. ఇక నా పిల్లలతో ఎప్పుడూ ఆ రెస్టరెంట్కు వెళ్లను’ అంటూ రెస్టరెంట్ పిక్ షేర్ చేసి ఒలింపిక్స్ 2024ను ట్యాగ్ చేశారు.
సెరెనా విలియమ్స్ పోస్టుపై పెనిన్సులా రెస్టరెంట్ స్టాఫ్ మాక్సిమ్ మన్నెవే స్పందించారు. ‘సెరెనా ఓ స్ట్రోలర్ (చిన్న పిల్లల బండి)తో వచ్చారు. ఆ సమయంలో కేవలం రెండు టేబుళ్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అవి కూడా రిజర్వ్ అయి ఉన్నాయి. సెరెనా వచ్చినప్పుడు నేను లేను. సెరెనాను మా స్టాఫ్ గుర్తించలేకపోవడంతో ఈ సమస్య వచ్చింది. ఇతర క్లయింట్స్కు చెప్పినట్లే.. ఆమెకు కూడా సమాధానం ఇచ్చాడు. టేబుల్ ఖాళీ అయ్యేవరకు బార్ వద్ద వేచి ఉండాలని సూచించాడు’ అని మాక్సిమ్ చెప్పారు.
Also Read: IND vs SL: మూడో వన్డే మ్యాచ్ టైగా ముగిస్తే.. సూపర్ ఓవర్!
మరోవైపు పెనిన్సులా రూఫ్టాప్ రెస్టరెంట్ మేనేజ్మెంట్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సెరెనా అంటే మాకెంతో గౌరవం. మా అతిథుల కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. రిజర్వేషన్ లేకుండా కుటుంబంతో కలిసి వచ్చిన సెరెనాకు మా రూఫ్టాప్లో అవకాశం కల్పించలేనందుకు మేం చింతిస్తున్నాం. మేం ప్రతిఒక్కరికీ అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఆగస్ట్ 5న మా రూఫ్టాప్ బార్ పూర్తిగా బుకింగ్ అయిపోయింది. రెండు టేబుళ్లు ఖాళీగా ఉన్నా అవి రిజర్వ్ అయ్యాయి. మరోచోట సెరెనాకు టేబుల్ను కేటాయిస్తామని చెప్పాం. తప్పకుండా ఆమె మరోసారి వస్తారని ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.