NTV Telugu Site icon

Paris Oympics 2024: చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్‌ మనికా బత్రా!

Manika Batra Paris Olympics 2024

Manika Batra Paris Olympics 2024

Manika Batra becomes 1st Indian table tennis player to reach Olympics Pre-Quarter Finals: భారత టెబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో రౌండ్-16‌కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా 29 ఏళ్ల మనికా రికార్డు నెలకొల్పింది. రౌండ్‌ 32లో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంక్‌ క్రీడాకారిణి ప్రితికా పవడేతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి సెట్ నుంచే విరుచుకుపడిన మనికా బాత్రా ఏ దశలోనూ ప్రత్యర్థి ప్రితికా పవడేకు అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌లో కాస్త పోటీ ఇచ్చిన ఫ్రాన్స్‌ క్రీడాకారిణిని ఆపై పుంజుకోలేకపోయింది. మనికా అద్భుత ఆటతో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా 4-0 తేడాతో ప్రితికాను చిత్తు చేసింది. ప్రస్తుతం ప్రపంచ 28వ ర్యాంక్‌లో ఉన్న మనికా.. ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో ఎనిమిదో సీడ్‌ మియూ హిరానో (జపాన్‌) లేదా జు చెంగ్జూ (హాంకాంగ్‌)తో తలపడనుంది.

Also Read: Rohan Bopanna Retirement: భారత జెర్సీలో చివరి మ్యాచ్‌ ఆడేశా: రోహన్‌ బోపన్న

మ్యాచ్ అనంతరం మనికా బాత్రా మాట్లాడుతూ… ‘ఒలింపిక్స్‌లో ఫ్రెంచ్ ప్లేయర్‌ను ఓడించడం సంతోషంగా ఉంది. నా కంటే మెరుగైన ర్యాంక్‌ ప్లేయర్‌పై పైచేయి సాధించా. రికార్డులు, ప్రిక్వార్టర్స్‌ గురించి పెద్దగా ఆలోచించట్లేదు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఒక్కో మ్యాచ్‌ గురించి ఆలోచించి ముందుకు సాగుతా’ అని చెప్పింది. మనికాకు ఇది మూడో ఒలింపిక్స్. ఇక ప్రితికా పవడేకు 18 ఏళ్లు కాగా.. మనికాకు 29 ఏళ్లు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ప్రితికా భారత సంతతి ప్లేయర్. ఆమె తల్లిదండ్రులు గతంలో పుదుచ్చేరిలో ఉండగా.. 2003లో ఫ్రాన్స్‌కు వెళ్లారు.