సోషల్ మీడియాలో లైక్స్ రాక ఆ ఎమ్మెల్యేలు తెగ పరేషాన్ అవుతున్నారట. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేకంగా శిక్షకులను కూడా పెట్టుకున్నారట. 3 కోట్ల విలువైన పనులు చేస్తే.. దానికి 30 కామెంట్స్ కూడా రాలేదని ఓ ఎమ్మెల్యే తల పట్టుకున్నారట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
ఎమ్మెల్యేలకు సోషల్ మీడియా పరేషాన్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అధికారపార్టీ ఎమ్మెల్యేల శిబిరాల్లో సోషల్ మీడియాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటం.. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలకు ఉన్న ఫాలోయింగ్.. వారు పెడుతున్న పోస్టింగ్స్కు ఉన్న రీచ్ను ఎక్కడ కొలమానంగా తీసుకుంటారో అని శాసనసభ్యులు పరేషాన్లో ఉన్నారట. లాభం లేదనుకున్న కొందరు ఎమ్మెల్యేలు దాని సంగతేంటో తేల్చే పనిలో పడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇద్దరు, మంచిర్యాల జిల్లాలోని మరో ఇద్దరు.. నిర్మల్ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే, ఆసిఫాబాద్ జిల్లాలోని మరో శాసనసభ్యుడు సోషల్ మీడియాను వాడుకునే విషయంలో పూర్గా ఉన్నారట. ఉమ్మడి జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం సామాజిక మాధ్యమాలను తమ ప్రచార సాధనాలుగా వాడేస్తున్నారట. మిగిలిన 8 నియోజకవర్గాల్లో ఆ ముచ్చటే లేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. చేసిన పనులపై పోస్టింగ్స్ పెట్టినా.. ఫొటోలు షేర్ చేసినా.. లైక్స్ రావడం లేదట. దీనిపై కొందరు ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
అనుచరులకు ప్రత్యేకంగా శిక్షణ
ఇక లాభం లేదని అనుకున్న కొందరు శాసనసభ్యులు ప్రత్యేకంగా సోషల్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ విషయంలో విపక్ష పార్టీలు అడ్వాన్స్గా ఉండటంతో.. వారిని అధిగమించేందుకు.. తమ అనుచరులకు శిక్షణ ఇప్పించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కొందరిని నియమించారట. ఈక్రమంలో ఓ ఫన్నీ ప్రచారం బాగా పాపులర్ అయ్యింది. ఓ ఎమ్మెల్యే 3 కోట్ల అంచనాతో ఓ కార్యక్రమం చేపట్టి దాన్ని సోషల్ మీడియాలో పెడితే.. వచ్చింది 30 కామెంట్సేనట. అది ఆ నోటా.. ఈనోటా బాగా వైరల్ అయ్యి.. ఆ ఎమ్మెల్యేకు ఉన్నది 30 మంది బలమే అని సెటైర్లు పేలుతున్నాయి.
హైదరాబాద్లోని నిపుణులతో ప్రత్యేకంగా గ్రూపులు
మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మరికొందరు ఎమ్మెల్యేలు యువత ఎలా ఉండాలి.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టింగ్స్ పెట్టాలి అని సభల్లో క్లాస్ తీసుకుంటున్నారు. వాట్సాప్ కంటే ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్ ఎలా ఉపయోగించాలో లెక్చర్ ఇస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న కొందరు నిపుణులతో ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికిప్పుడు అనుచరులను అప్గ్రేడ్ చేస్తున్నారట. సమాచారాన్ని ఏ విధంగా స్టిక్కర్స్, లేబుల్స్, గ్రాఫిక్స్ రూపంలో వైరల్ చేయాలో తర్ఫీదు ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువగా జనాల్లోకి సోషల్ మీడియా ద్వారా రీచ్ కాకపోతే.. విపక్షాలు పైచెయ్యి సాధిస్తాయని.. వాటిని పార్టీ అధిష్ఠానం కూడా గుర్తిస్తే మొదటికే మోసం రావొచ్చని గులాబీ ఎమ్మెల్యేలు కలవర పడుతున్నారట.
మునుగోడు ఉపఎన్నిక తర్వాత పీక్స్కు చేరిన ప్రచారం
మునుగోడు ఉపఎన్నిక తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఈ సోషల్ మీడియా పిచ్చి ఎక్కువైందని టాక్. ఇప్పటికే నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు సామాజిక మాధ్యమాలను విరివిగా వాస్తున్నాయి. ఎన్నికల నాటికి వారిని అధిగమించాలనేది ఎమ్మెల్యేగా టార్గెట్గా కనిపిస్తోంది. మరి.. ఎమ్మెల్యే పరేషాన్ ఎప్పుడు తీరుతుందో ఏమో..!

