ఆ నియోజకవర్గంలో మళ్లీ పెద్దాయనే పోటీ చేయాలా? వయస్సు మీద పడి వారసులను దించాలని చూస్తున్నా వర్కవుట్ అయ్యేలా లేదా? తాజాగా సీఎం చేసిన వ్యాఖ్యల మర్మం ఏంటి? వారసులకు ఎంట్రీకి చెక్ పడినట్టేనా?
బాన్సువాడలో పోచారం వారసులకు బ్రేక్ పడినట్టేనా?
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సీఎం కేసీఆర్ పర్యటన తర్వాత కొత్త చర్చ మొదలైంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని ఉద్దేశించి.. ముఖ్యమంత్రి సభలో చేసిన కామెంట్స్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. పోచారం శీనన్న సేవలు బాన్సువాడకు అవసరం.. నేను పోచారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం తిమ్మాపూర్ సభలో ప్రకటించారు. ఈ కామెంట్స్ వెనుక ఉద్దేశంపై ఎవరికి నచ్చిన రీతిలో వారు ఊహించుకుంటున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో బాన్సువాడలో వారసులను దించాలని పోచారం చూస్తున్నారు. ఇప్పుడు సీఎం ప్రకటనతో దానికి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.
బాన్సువాడ సీటు ఆశిస్తున్న పోచారం కుమారులు
వయసు మీద పడటంతో విశ్రాంతి తీసుకోవాలన్నది పోచారం ఆలోచనగా ఉంది. తన స్థానంలో కుమారుడు పోచారం భాస్కరరెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలకు అర్జీ పెట్టుకున్నారట. భాస్కరరెడ్డి ప్రస్తుతం DCCB ఛైర్మన్గా ఉన్నారు. నియోజకవర్గంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. పార్టీ కేడర్ కూడా భాస్కర్రెడ్డే పోటీ చేస్తారని ఫిక్స్ అవుతున్న తరుణంలో సీఎం చేసిన ప్రకటనతో ఆలోచనలో పడ్డారట. ఇదే సీటును పోచారం మరో కొడుకు సురేందర్రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కొడుకులకు ఛాన్స్ లేనట్టే అని టాక్.
బాన్సువాడలో శ్రీనివాసరెడ్డే పోటీ చేస్తారా?
పోచారం స్పీకర్గా ఉండటంతో నియోజకవర్గ ఇంఛార్జ్గా సురేందర్రెడ్డి వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఇద్దరు కుమారులు ఇక్కడి సీటుకోసం పోటీ పడుతున్న పరిస్థితి. కుమారుల మధ్య నెలకొన్న ఈ పోటీ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లిందో ఏమో.. వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాసరెడ్డే పోటీ చేస్తారనే విధంగా కామెంట్స్ చేశారు సీఎం. బాన్సువాడ గురించి .. ఇక్కడి సమస్యల గురించి శీనన్నకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు సీఎం. తనకు 69 ఏళ్లు వచ్చినా రాష్ట్రం కోసం దేశం కోసం పనిచేస్తున్నానని.. తాను ఉన్నంత వరకు పోచారాన్ని వదిలి పెట్టేది లేదని సీఎం చెప్పారు. దీంతో పెద్దాయనే మళ్లీ పోటీ చేస్తారనే అభిప్రాయానికి వస్తున్నారు పార్టీ నేతలు.
పెద్దాయనే పోటీ చేస్తారని చెప్పడంతో కేడర్ సంబురాలు
బాన్సువాడలో శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే రాబోయే ఎన్నికల్లో తిరుగు ఉండబోదనే విషయం సర్వేల్లో తేలిందట. ఇప్పుడు పెద్దాయనే పోటీ చేస్తారనేలా సీఎం చెప్పడంతో కేడర్ సంబరాలు చేసుకుంటున్నట్టు సమాచారం. శ్రీనివాసరెడ్డి మాత్రం వారసులను బరిలో దించాలన్న కోరిక ఇప్పట్లో తీరేలా లేకపోవడంతో.. ఆ సమయం ఎప్పుడొస్తుందా అని మథన పడుతున్నారట.

